శివుడి ఆలయంలో నటి అమలా పాల్కు దక్కని ప్రవేశం- బయటి నుంచే మొక్కులు..!!
తిరువనంతపురం: ప్రముఖ నటి అమలా పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారామె. నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసే కేరళలోని ఓ హిందూ ఆలయంలో ఆమెకు ప్రవేశం లభించలేదు. భగవంతుడిని దర్శించుకోవడానికి ఆమెకు అనుమతి దక్కలేదు. కేరళలో ఈ ఘటన కలకలం రేపుతోంది. వర్ణ విచక్షణ ఇంకా కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
కేరళలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో అన్యమతస్తులకు ప్రవేశం లేదనే విషయం తెలిసిందే. త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ శ్రీకృష్ణుడి దేవాలయం, ఎర్నాకుళం జిల్లా కాలడి సమీపంలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయం.. వంటి చోట్ల అన్యమతస్తుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతోంది. ఇతర ఆలయాల్లో ఆ నిబంధనలు లేనప్పటికీ- అన్యమతస్తులెవరైనా దర్శిస్తే ప్రక్షాళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రఖ్యాత గాయకుడు కేజే ఏసుదాస్ కూడా గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకోలేకపోయిన విషయం తెలిసిందే.
అమలా పాల్.. జన్మతః క్రైస్తవురాలు. తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా.. అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు. అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు. ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు.
ఆలయ కమిటీ ప్రతినిధులు, సిబ్బందిని నచ్చజెప్పినప్పినప్పటికీ ప్రవేశం సాధ్యం కాలేదు. దీనితో అమలా పాల్ అమ్మవారిని దర్శించుకుని తిరుగుముఖం పట్టారు. మహాదేవ ఆలయంలో తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఆమె విజిటర్స్ రిజిస్టర్ లో నమోదు చేశారు. మహదేవుడిని మనసులోనే ప్రార్థించుకుని తిరుగుముఖం పట్టానని పేర్కొన్నారు. 2023లో కూడా కఠినమైన మతాచారాలు, వర్ణవివక్ష కొనసాగుతుందంటే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.