అసెంబ్లీని కుదిపేసిన నటి లైంగిక దాడి: ఆమెను వీడియో తీసిన ఫోన్ అదేనా?
ప్రముఖ హీరోయిన్ పైన లైంగిక దాడి అంశం సోమవారం నాడు కేరళ అసెంబ్లీని కుదిపేసింది. ప్రముఖ మలయాళీ నటిని దుండగులు కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
తిరువనంతపురం: ప్రముఖ హీరోయిన్ పైన లైంగిక దాడి అంశం సోమవారం నాడు కేరళ అసెంబ్లీని కుదిపేసింది. ప్రముఖ మలయాళీ నటిని దుండగులు కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ అంశం ఈ రోజు కేరళ అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ కేసు దర్యాఫ్తును బలహీనపరుస్తోందని ఆరోపించారు.
కుట్ర దాగి ఉందని నినాదాలు
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంది. వెల్లోకి చొచ్చుకు వచ్చింది. నటి వేధింపుల కేసులో కుట్ర దాగి ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం సిన్సియర్గా దర్యాఫ్తు కొనసాగించడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వాగ్వాదం
నటి లైంగిక వేధింపుల అంశంపై అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సభ్యులు, ప్రతిపక్ష యూడీఎఫ్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల భద్రత, దాడులు తదితర అంశాల పైన వాగ్వాదం జరిగింది. ప్రతిపక్షం నటి అంశంపై క్లారిటీ డిమాండ్ చేయడంతో స్పీకర్ తొలుత సభను కాసేపు వాయిదా వేశారు.
చర్చకు నో
ఆ తర్వాత స్పీకర్ ఇరు పక్షాలతో సమావేశమయ్యారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. నటి లైంగిక వేధింపుల అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. స్పీకర్ నిరాకరించారు. దీంతో విపక్షాలు ప్రొసీడింగ్స్ను బైకాట్ చేశారు.
అరెస్టు చేశామన్న సీఎం
అంతకుముందు.. ప్రతిపక్షం నటి లైంగిక వేధింపుల అంశాన్ని చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని తిరస్కరించారు. సీఎం పినరాయి విజయన్ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్తో పాటు పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారన్నారు.
కుట్ర లేదు
నటికి వేధింపుల కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ముఖ్యమంత్రి చెప్పారు. పోలీసులు స్వేచ్ఛగా దర్యాఫ్తు చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కోర్టుకు కూడా తెలిపామన్నారు. కేసును నీరుగారుస్తున్నామని ప్రతిపక్షం చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
కోయంబత్తూరుకు నిందితులు
ఇదిలా ఉండగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నిందితుల్లో ఇద్దర్ని దర్యాప్తు నిమిత్తం కేరళ పోలీసులు ఆదివారం నాడు కోయంబత్తూరు తీసుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో విజేష్, సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్లు ఘటన తర్వాత కోయంబత్తూరులో ఉన్నారని తెలిసింది.
నటిని అదే ఫోన్లో వీడియో తీశారా
కేరళ పోలీసుల అదుపులో ఉన్న వారిని వాహనంలో ఆదివారం కోయంబత్తూరుకు తీసుకొచ్చారు. వాళ్లు ఉన్నట్టు చెప్పిన పీలమేడులోని ఇంటికి తీసుకెళ్లి, దర్యాప్తు చేశారు. అక్కడి నుంచి ఓ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నటిని చిత్రీకరించిన సెల్ఫోన్ అదేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిందితులకు ఇక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.