మరో విషాదం: యువ నటి లీనా ఆచార్య కన్నుమూత, ఒక్క కిడ్నీతోనే ఆనందంగా..
ముంబై: మరో బుల్లి తెర యు నటి కన్నుమూసింది. హిందీ టీవీ ప్రముఖ యువ నటి లీనా ఆచార్య(30) అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో వినోద రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్లాస్ ఆఫ్ 2020, సేట్ జీ కార్యక్రమాలతో అలరించిన నటీమణి లీనా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ శనివారం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు.
క్లాస్ ఆఫ్ 2020లో లీనాతో కలిసి నటించిన రోహన్ మెహ్రా ఇన్స్టాగ్రాంలో నివాళి తెలిపారు. లీనా ఆచార్యతో పర్ఫెక్ట్ పతిలో కలిసి నటించిన మరో నటుడు ఆయుష్ ఆనంద్ నటి గురించి మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. లీనా కిడ్నీ సమస్యలతో ఏళ్ల నుంచి బాధపడుతున్నా ఒక్కసారి కూడా ఆ విషయాన్ని ఆమె చెప్పలేదన్నారు.
లీనా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని తెలిసి ఆమె సోదరుడితో మాట్లాడినట్లు తెలిపారు. అప్పుడే ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోందని తెలిసిందని చెప్పారు. ఇన్ని రోజుల నుంచి ఒకే కిడ్నీతో జీవనం సాగిస్తోందని, ఆ కిడ్నీ కూడా వాళ్ల అమ్మదానం చేసినట్లు తెలిసిందని ఆనంద్ వెల్లడించారు.
అందరితో ఎంతో కలివిడిగా ఉండే లీనా మృతి ఎంతో బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను ఎప్పుడూ బయటపడకుండా అందరితో నవ్వుతూ ఉండేవారని, నవ్విస్తూ ఉండేవారని తెలిపారు. ఆప్కే ఆజానేసే, మేరీ హానికారక్ బీవీ తోపాటు పలు టీవీ కార్యక్రమాలతో లీనా ఆచార్య ఆకట్టుకున్నారు. యువ నటి మరణం బుల్లితెరకు తీరని లోటని అన్నారు.