సదానంద తనయుడు కార్తిక్పై మైత్రేయ మరో ట్విస్ట్
బెంగళూర్: రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడ విషయంలో నటి మైత్రేయ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు ముందు ఆమె బుధవారంనాడు మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. తన కేసు పరిష్కారం అయ్యే వరకు మరొకరిని కార్తిక్ గౌడ పెళ్లి చేసుకోకుండా నిలువరించాలని ఆమె ఫ్యామిలీ కోర్టును కోరింది.
కార్తిక్ గౌడ చట్టబద్దమైన భార్యగా తనను ప్రకటించాలని కోరుతూ మైత్రేయ ఫ్యామిలీ కోర్టు ముందు మరో దరఖాస్తు పెట్టుకుంది. ఈ కేసును ఫ్యామిలీ కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. గత వారం కార్తిక్ గౌడ గ్రాండ్ మదర్ మరణించింది. ఆమె మృతితో విషాదంతో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కార్తిక్ గౌడ తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది.
కార్తిక్ గౌడ తరఫు న్యాయవాది అభ్యంతరాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నెల 21వ తేదీ లోగా న్యాయావది ఆ పనిచేయాల్సి ఉంటుంది. మైత్రేయ కేసులో సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
కార్తిక్ గౌడపై మైత్రేయ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ స్థితిలో కార్తిక్ గౌడకు బెంగళూరు పోలీసులు ఆయనకు గతంలో అల్టిమేటం కూడా ఇచ్చారు. బుధవారంలోగా లొంగిపోకపోతే అరెస్టు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రేమ పేరిట తనను పెళ్ల చేసుకుని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడంటూ వర్ధమాన నటి మైత్రేయి గౌడ ఆర్.టి.నగర్ పోలీసులకు ఫిర్యా దు చేసిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో మైత్రేయి ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారంనాడే కార్తీక్ గౌడ నివాసానికి పోలీసులు నోటీసులు పంపగా అతడు అదృశ్యమయ్యాడు. అయితే, చివరకి కార్తిక్ గౌడకు బెయిల్ లభించింది.