మాండ్యలో రమ్యపై పోటీ: రక్షితకు కెజెపి బంపర్ ఆఫర్
బెంగళూరు: ప్రముఖ నటి రక్షితకు డిమాండ్ వచ్చింది! 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నటి రక్షితకు కర్నాటక జనతా పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది! కర్నాటక జనతా పార్టీ అధ్యక్షులు పద్మనాభ ప్రసన్న మాట్లాడుతూ.. రక్షిత మాండ్య నుండి పోటీ చేస్తానంటే టిక్కెట్ ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ప్రస్తుతం మాండ్య లోకసభకు కాంగ్రెసు పార్టీ తరఫున నటి రమ్య ఉన్నారు. వచ్చే ఎన్నికలలోను ఆమె పోటీ చేయనున్నారు. అయితే, రక్షిత రానున్న ఎన్నికల్లో మాండ్య నుండే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జెడి(ఎస్)లో ఆమెకు మాండ్య నియోజకవర్గం నుండి ఇతర అభ్యర్థుల నుండి పోటా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కెజిపి ఆమెకు టిక్కెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది.
రక్షితకు జెడి(ఎస్) ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జెడి(ఎస్) అధ్యక్షులు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మాండ్య నియోజకవర్గం పార్లమెంటు టిక్కెట్ను రక్షితకు ఇవ్వడం లేదని చెప్పారు.
రక్షిత మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపించారని తెలిపారు. కానీ ఆమెకు పార్టీ టిక్కెట్ ఇవ్వడం లేదని, స్థానికులకే టిక్కెట్ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో జెడి(ఎస్) పార్టీ తరుపున కర్నాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని రక్షిత అంతకుముందు వెల్లడించారు. జెడి(ఎస్) నుండి తప్ప, మ్యాండ్యా నియోజకవర్గం నుండి తప్ప మరే ప్రాంతం నుండి, మరే పార్టీ నుండి పోటీ చేయను అనిరక్షిత వెల్లడించడం గమనార్హం. మరి మాండ్య నుండి పోటీ చేసేందుకు రక్షిత ఏం చేస్తారో.