మీటూ: హీరో అర్జున్ అశ్లీల మెసేజ్ లు పంపించారు, కోర్టులో ఇచ్చాను: నటి శృతి హరిహరన్!
బెంగళూరు: మీటూ ఆరోపణలు చేసి బహుబాష నటుడు, హీరో అర్జున్ మీద కేసు పెట్టిన నటి శృతి హరిహరన్ తాను అందరి లాంటి అమ్మాయిని కాదని, తనకు ఎంతో ధైర్యం ఉందని, చివరి వరకూ చట్టపరంగా పోరాటం చేస్తానని అంటోంది. హీరో అర్జున్ పంపించిన అశ్లీల మెసేజ్ లు కోర్టులో ఇచ్చానని ఆమె అంటున్నారు.
బుధవారం బెంగళూరులో కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మిని కలిసి హీరో అర్జున్ మీద ఫిర్యాదు చేసిన నటి శృతి హరిహరన్ మీడియాతో మాట్లాడారు. విస్మయ సినిమా షూటింగ్ సందర్బంగా హీరో అర్జున్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని శృతి హరిహరన్ ఆరోపించారు.
హీరో అర్జున్ తన మొబైల్ కు అశ్లీల మెసేజ్ లు పంపిచారని, వాటిని కోర్టులో సమర్పించానని, అతనికి వ్యతిరేకంగా తన దగ్గర సాక్షాలు ఉన్నాయని, చివరి వరకూ పోరాటం చేస్తానని నటి శృతి హరిహరన్ ఆరోపించారు. మహిళా కమీషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మిని కలిసి అర్జున్ మీద ఫిర్యాదు చేసి వాటి సాక్షాలు ఇచ్చానని ఆమె అన్నారు. హీరో అర్జున్ మీద వేసిన కేసు ఎట్టిపరిస్థితుల్లో వెనక్కితీసుకోనని, ఎవ్వరికి తాను క్షమాపణలు చెప్పనని నటి శృతి హరిహరన్ స్పష్టం చేశారు.
కేసు కోర్టులో విచారణలో ఉందని, ఈ విషయంపై తాను ఎక్కువగా మాట్లాడనని, మొబైల్ లో ఉన్న సాక్షాలు సైబర్ క్రైం పోలీసులకు ఇవ్వాలని శృతి హరిహరన్ కు సూచించానని మహిళా కమీషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి మీడియాకు చెప్పారు. హీరో అర్జున్, శృతి హరిహరన్ కేసు విచారణ చేసిన కోర్టు ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.