నమ్మకం ఉంచండి.. అప్పులన్నీ తీర్చేస్తాం..
ముంబై : అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రుణ చెల్లింపులకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం జరిగిన మీటింగ్లో ఆయన ఈ హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 మే మధ్యకాలంలో వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రుణాలు చెల్లించినట్లు అనిల్ అంబానీ స్పష్టం చేశారు. ఆస్తుల విక్రయం, తనఖా ద్వారా అప్పులు తీర్చినట్లు చెప్పారు.
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంతి తమకు ఎలాంటి సాయం అందలేదని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. ఎన్ని సవాళ్లు, ఇబ్బందులు ఎదురైనా రుణాలు తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అడాగ్ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన మొత్తంలో రూ.24,800 కోట్లు అసలుకాగా.. రూ.10,600 కోట్లు వడ్డీ అని అనిల్ అంబానీ చెప్పారు. అసెట్ మానిటైజేషన్ ప్లాన్ కింద ఈ మొత్తాన్ని చెల్లించామని, భవిష్యత్లోనూ సమయానికి అన్ని చెల్లింపులు చేస్తామని చెప్పారు. కొద్ది రోజులుగా తమపై, కంపెనీపై దుష్ప్రచారం సాగుతోందని, ఇది రిలయన్స్ కంపెనీల షేర్ల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకం కోల్పోయేలా చేస్తోందన్నారు.
ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులున్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందన్నారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.