అదానీ, అంబానీలకు ముందే తెలుసు: నోట్ల రద్దుపై మోడీకి సొంత నేత షాక్
జైపూర్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయం ప్రముఖ పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలకు ముందే తెలుసుననే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
పాత నోట్ల రద్దు గురించి అంబానీ, ఆదానీలకు ముందే తెలుసునని కోటా జిల్లాకు చెందిన లాడ్ పురా ఎమ్మెల్యే భవాని సింగ్ రాజావత్ అన్నారు. ఆయన విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
పాత పెద్ద నోట్ల రద్దు గురించి అంబానీ, అదానీ, ఇతర కుబేరులకు ముందుగానే తెలుసునని, సూచనప్రాయంగా వారికి వెల్లడించడంతో ముందుగానే వారంతా జాగ్రత్త పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త నాణ్యత గురించి కూడా ఆయన వ్యతిరేకంగా వార్తలు చేశారు.
కొత్త కరెన్సీ నోటు నాసిరకంగా ఉందని, దీనిని చూస్తే నకిలీ నోటు అన్న భావన కలుగుతుందన్నారు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో ఆయన మాట మార్చారని అంటున్నారు. కొంతమంది జర్నలిస్టులతో పిచ్చాపాటీగా తాను మాట్లాడిన దానిని వక్రీకరించారన్నారు.