తొలిసారి నోరు విప్పిన అదానీ.. అందుకే ఎఫ్పీఓ ఉపసంహరించుకున్నామని క్లారిటీ!!
తొలిసారి నోరు విప్పిన అదానీ ఎఫ్పీఓ ఎందుకు ఉపసంహరించుకున్నారో క్లారిటీ ఇచ్చారు. అదానీ గ్రూప్ సంస్థల తాజా పరిస్థితి వివరించారు.
ఎట్టకేలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ సంస్థల అధినేత, అపర కుబేరుడు గౌతమ్ అదానీ తాజా పరిణామాల నేపథ్యంలో నోరు విప్పారు. అదానీ ఎంటర్ప్రైజెస్ 20000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ ను ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న ఒడిదుడుకులే తాము ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానమైన కారణమని ఆయన వివరించారు.
ఎఫ్పీఓ ఉపసంహరణపై గౌతమ్ అదానీ క్లారిటీ
ప్రతిపాదిత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ను ఉపసంహరించుకున్న షాకింగ్ నిర్ణయం తర్వాత, అదానీ గ్రూప్ సంస్థల యొక్క ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగానూ ప్రభావితం కావని అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. అదానీ సంస్థల బ్యాలెన్స్ షీట్ బలంగానే ఉందని, సంస్థ రుణ బాధ్యతలను నెరవేర్చటంలో అదానీ గ్రూప్ సంస్థకు ఉన్న ట్రాక్ రికార్డు కూడా బాగుందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆస్థుల విషయంలో అదానీ ఏమన్నారంటే
పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ను ఉపసంహరించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. మార్కెట్లో అస్థిరతను పరిగణనలోకి తీసుకొని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ నిర్వహించటం సరైనది కాదని బోర్డు గట్టిగా భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమ్ అదాని వెల్లడించారు. సకాలంలో ప్రాజెక్టులను అమలు చేయడం, డెలివరీ చేయడం పై తమ దృష్టి సారిస్తామని అదానీ తెలిపారు. తమ ఆస్తులు పటిష్టంగానే ఉన్నాయన్నారు.
తమ దృష్టి దానిపైనే ఉంటుందని చెప్పిన అదానీ
దీర్ఘకాలిక విలువ సృష్టి పైన దృష్టి సారించడం కొనసాగిస్తామని గౌతమ్ అదానీ తెలిపారు. మా ప్రతి వ్యాపారం బాధ్యతాయుతమైన రీతిలో విలువను సృష్టించడం కొనసాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ భాగస్వామ్యం కలిగి ఉన్న తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్న గవర్నెన్స్ సూత్రాలు బలమైన ధ్రువీకరణ అని ఆయన పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ స్థిరీకరించబడిన తర్వాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తన కాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని సమీక్షిస్తుందని, వ్యాపార కార్యకలాపాలలో పాలన, సామాజిక, పర్యావరణ సూత్రాలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత .. అందుకే ఈ నిర్ణయం
భారతదేశ వెలుపల, లోపల పెట్టుబడి బ్యాంకర్లు, సంస్థాగతంగా ఉన్న పెట్టుబడిదారులు, వాటాదారుల నుండి ఈ సమయంలో వస్తున్న మద్దతుకు అదానీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పెట్టుబడిదారుల నుంచి గ్రూపుకు మద్దతు లభిస్తుంది అన్న నమ్మకాన్ని అదానీ వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్న ఆయన, సంభావ్య నష్టాల నుంచి పెట్టుబడిదారులను రక్షించడానికి తాను ఎఫ్ పి ఓ ను ఉపసంహరించుకున్నానని అదానీ తేల్చి చెప్పారు. వ్యాపారవేత్తగా తన 40 ఏళ్ల ప్రయాణంలో అన్ని వాటాదారుల నుండి అధిక మద్దతు లభించిందని, పెట్టుబడిదారులు తనపై ఉంచిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకుంటానని అదానీ స్పష్టం చేశారు.
టార్గెట్ అదానీ.. హిండెన్బర్గ్ నివేదికపై పార్లమెంట్లో ప్రకంపనలు; బీఆర్ఎస్ వాయిదా తీర్మానం!!