'ఆదర్శ్ స్కాం'పై కోర్టు సంచలనం: ఆ బిల్డింగ్ కూల్చేయండి
ముంబై: ఆదర్శ్ స్కాంలో బాంబే హైకోర్టు శుక్రవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. వివాదానికి కారణమైన ముప్పై ఒక్క అంతస్థుల ఆదర్శ్ సొసైటీ భవనాన్ని కూల్సివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని కోర్టు పేర్కొంది. ఈ భవనంలో అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్కాం కారణంగా నాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆదర్శ్ సొసైటీ భవనంలో అశోక్ చవాన్ ముగ్గురు బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించిన ఆరోపణలు ఉన్నాయి.
ఆదర్శ్ భవనంలోని 102 ప్లాట్లలో 25 ప్లాట్లు అక్రమంగా ఇచ్చినవేనని 2013లో జ్యూడిషియరీ కమిషన్ గుర్తించింది. దీంతో కేసులు నమోదయ్యాయి. క్విడ్ ప్రో కో కింద పలువురికి ప్లాట్లు ఇచ్చినట్లుగా కమిషన్ గుర్తించింది. కాగా, తాజాగా, ఈ భవంతిని కూల్చేయాలని కోర్టు ఆదేశించింది.