ఆదర్శ్ స్కాం: దేవయానిపై ఛార్జీషీట్! దాచి పెట్టి ఫ్లాటు..
న్యూఢిల్లీ: ధౌత్యకారిణి దేవయాని కోబ్రాగేడ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆదర్శ్ సొసైటీలో ప్లాట్లు తీసుకున్నారనే అభియోగంపై సిబిఐ ఆమెపై ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది. ఆమెతో పాటు ఆమె తండ్రి పైన కూడా దాఖలు చేసే అవకాశముంది. ప్రభుత్వం కోటా కింద వేరే ఫ్లాటును తీసుకున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారంతో ఆమె ఫ్లాటు తీసుకున్నారని సిబిఐకి ఆధారాలు లభించాయి.
దేవయాని తండ్రి ఉత్తమ్ కోబ్రాగేడ్ మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అదికారి. మహారాష్ట్ర గృహ నిర్మాణ, ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సిఈవోగా ఆయన కొన్నాళ్లు పని చేశారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై దర్యాఫ్తు జరుపుతున్న సిబిఐ.. దానిలో అక్రమ లబ్ధిదారులు, బినామీ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో విచారిస్తున్నప్పుడు దేవయాని పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
2005లో ఆమె ఓషివారాలో మరో ప్రభుత్వం హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాటు పొందారని, డిఫెన్స్ ఎస్టేట్ నిబంధనలను అనుసరించి రాయితీ ధరపై రెండు సొసైటీల నుంచి సభ్యులు ప్లాట్లను తీసుకోవడానికి వీల్లేదని సిబిఐ చెబుతోంది.
మరోవైపు, గత నెల లగేజిలో బులెట్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీ విమానాశ్రయంలో న్యూయార్క్ పోలీసు అధికారి అరెస్టు... న్యూయార్క్లో భారత దౌత్యవేత్త దేవయాని అరెస్టు ఉదంతానికి భారత్ తీసుకున్న ప్రతీకార చర్య అంటూ అమెరికా మీడియాలో వచ్చిన వార్తలను భారత ప్రభుత్వ శనివారం ఖండించింది.