చిక్కుల్లో అద్వానీ!: బిగుస్తున్న బాబ్రీ ఉచ్చు.. మరిన్ని అభియోగాలు!?
అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా మరిన్ని అభియోగాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్నో: బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అద్వానీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా మరిన్ని అభియోగాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా, బాబ్రీ కూల్చివేత అంశంలో అద్వానీ సహా పలువురు బీజేపీ అగ్ర నేతలపై ఉన్న కుట్ర కేసును 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ దీన్ని సుప్రీంలో సవాల్ చేయడంతో.. గత నెలలో సుప్రీం కోర్టు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించింది.
"ముమ్మాటికీ ఇది మోడీ కుట్రే!, ఆ సహాయం మరిచిపోయి అద్వానీని బలిచేశాడు"
కేసు విచారణను రెండేళ్లలో ముగించాలని సుప్రీం గత ఏప్రిల్ 19న సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే మరో కీలక వ్యాఖ్య చేసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వాణీ సహా తదితరులపై కొత్తగా అభియోగాలు మోపవచ్చునని తెలిపింది. ఇదిలా ఉంటే, ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.