అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచారు. తర్వాత రామాలయం నిర్మించే చోట పూజలు కూడా నిర్వహించారు. తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాది వేసే కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.
ఆగస్ట్ 5వ తేదీన ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లో కార్యక్రమం ఉండగా.. ఏర్పాట్లను ముఖ్యమంత్రి యోగి పరిశీలించారు. ప్రధాని మోడీ పునాది రాయి వేసిన తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమవుతోంది.
ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేసే రోజున కేవలం 200 మందిని మాత్రమే అనుమతిస్తామని ఆలయ ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తామని చెప్పారు. అన్నీ జాగ్రత్తలు తీసుకొని ఆలయ నిర్మాణ కార్యక్రమం చేపడుతామని ఆయన వివరించారు. భూమి పూజ తర్వాత ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతాయి.