15 ఏళ్ల ఆదివాసీ బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్... వెంటాడి పట్టుకుని అఘాయిత్యం...
జార్ఖండ్లో దారుణం జరిగింది. 15 ఏళ్ల ఓ ఆదివాసీ బాలికపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం(డిసెంబర్ 1) అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని జార్ఖండ్ బీజేపీ ఆరోపిస్తోంది.
అసలేం జరిగింది...
ఖుంతీ జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ వెల్లడించిన కథనం ప్రకారం.. సోమవారం ఆ బాలిక తన స్నేహితులైన ఓ బాలిక,నలుగురు అబ్బాయిలతో కలిసి... వారి గ్రామానికి 12కి.మీ దూరంలో జరుగుతున్న ఓ ఉత్సవానికి వెళ్లింది. రాత్రి 9.30గంటల సమయంలో ఆ ఆరుగురు జాతర నుంచి ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓచోట ఐదుగురు దుండగులు బైక్స్తో వారిని అడ్డగించారు. ఆపై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఆరుగురు తలో దిక్కు పరిగెత్తారు.
వెంబండించి... గ్యాంగ్ రేప్...
పరిగెత్తుతున్న ఆ బాలికను దుండగులు వెంటాడి మరీ పట్టుకున్నారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో దుండగుల కోసం విస్తృతంగా గాలించారు. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దుండగులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వంపై బీజేపీ ఫైర్...
గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ శాడియో తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేఎంఎం నేత్రుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గడిచిన 11 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1300 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా జేఎంఎం,కాంగ్రెస్ నోరు విప్పకపోవడం దారుణమన్నారు. తాజా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.