రేపిస్టు పురుషాంగాన్ని కోసేసి, పాతేసిన మహిళ
గౌహతి: అస్సాంలో తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తికి ఓ గిరిజన మహిళ రోమాలు గగుర్పొడిచే శిక్ష వేసింది. అస్సాంలోని బిస్వనాథ్ చారిలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భారజులి గ్రామంలో ఏప్రిల్ 4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కృష్ణా భూమిజ్ అనే యువకుడు రిటా ఓరాంగ్ అనే వివాహితపై, ఆమె కూతురిపై ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. రిటా అతనిపై దాడి చేసి, అతని పురుషాంగాన్ని కత్తితో కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అతని శవాన్ని తన స్నేహితురాళ్ల సహాయంతో ఆమె శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేసింది. ఆమెకు ఏడుగురు మహిళలు సాయం చేసినట్లు బయటపడింది.
అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. పోలీసులు రిటాను బుధవారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై రిటా స్పందిస్తూ ఏ ఒక్క అమ్మాయికి ఇలా జరగకూడదనే అంత కిరాతకంగా హత్య చేశానని తెలిపింది. కృష్ణపై గతంలో కూడా రెండు కేసులు ఉన్నట్లు తెలిసింది.
రీటాతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తనపై, తన కూతురిపై అత్యాచారం చేయడానికి కృష్ణా ప్రయత్నించాడని, అతి ప్రయత్నం మీద తాను గొడ్డలిని తీసుకోగలిగానని, దాడితో అతను పారిపోవడానికి ప్రయత్నించాడని, తాను వెంటాడి నరికి చంపానని మహిళ చెప్పింది.
తాను గొడ్డలితో దాడి చేయడంతో అతను వెల్లికిలా పడిపోయాడని, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని, అప్పుడు తాను అతని ప్రైవేట్ భాగాలను నరికేశానని రీటా చెప్పింది. బతికి మళ్లీ అటువంటి పనులు చేస్తాడనే భయంతోనే ప్రైవేట్ భాగాలను నరికేసినట్లు ఆమె తెలిపింది.