నిర్భయకు న్యాయం.. మరింత జాప్యం: సీన్ లోకి మరో దోషి పవన్: మైనర్ కోణం..ఉరిశిక్ష చట్టవ్యతిరేకమంటూ..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఏడేళ్ల కిందట చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం కేసు గురువారం అనూహ్య మలుపు తిరిగింది. నిర్భయ అత్యాచారం కేసు దేశంలో ఏ స్థాయిలో ప్రకంపనలను సృష్టించిందో.. దోషులు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు కూడా అదే స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి. తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే- మరో దోషి తెరమీదికి వచ్చాడు. అతనే పవన్ కుమార్ గుప్తా.
డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లి
ఎవరీ పవన్ కుమార్ గుప్తా.. ?
నిర్భయపై అత్యాచారం చేసిన ఆరుమందిలో పవన్ కుమార్ గుప్తా కూడా ఒకడు. ఈ కేసులో అతనికి ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. తోటి దోషులు అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలతో కలిసి తీహార్ జైలులో ఉంటున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. వారికి మరణశిక్షను విధించాల్సి ఉంది. ఆరుమంది కామాంధుల్లో పవన్ కుమార్ గుప్తా.. నిర్భయను చిత్రహింసలకు గురి చేశాడంటూ పోలీసులు ఛార్జిషీట్ ను నమోదు చేసిన విషయం తెలిసిందే.
అతని కేసు ఏంటీ?
ఈ ఉదయం అతను అనూహ్యంగా తెర మీదికి వచ్చాడు. నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో తాను మైనర్ నని చెబుతున్నాడు. చట్టప్రకారం మైనర్ లకు మూడేళ్లకు మించి అధికంగా శిక్ష విధించడం అన్యాయమని అతను వాదిస్తున్నాడు. తనతో పాటు అత్యాచారానికి పాల్పడిన మైనర్ కు మూడేళ్లు మాత్రమే శిక్ష పడిందని, ప్రస్తుతం అతను బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాడని గుర్తు చేశాడు. మైనర్ అయినప్పటికీ.. తనకు చట్టవిరుద్ధంగా ఉరిశిక్ష విధించారని అతను వాదిస్తున్నాడు.
పవన్ తరఫు న్యాయవాది వాదనేంటీ?
ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. పవన్ గుప్తా తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్.. ఈ పిటీషన్ ను వేశారు. 2012 డిసెంబర్ 16వ తేదీన రాత్రివేళ కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన సమయానికి పవన్ కుమార్ గుప్తా మైనర్ అని ఏపీ సింగ్ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. మైనర్ అవునా? కాదా? అని నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలను ఢిల్లీ పోలీసులు అప్పట్లో నిర్వహించలేదని వాదించారు.
మైనర్ ఎవరు?
ఇదే కేసులో అరెస్టయిన మహ్మద్ అఫ్రోజ్ అలియాస్ రాజు మైనర్ గా నిర్ధారించారు. జువైనల్ చట్టం కింద అతనికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షను విధించారు. శిక్ష అనుభవించిన తరువాత 2015లో అతను విడుదల అయ్యాడు. అతనికి మాత్రమే వయస్సును నిర్ధారించే పరీక్షలు చేశారని, అతను మైనర్ గా తేలడంతో మూడేళ్లు మాత్రమే శిక్షను విధించారని ఏపీ సింగ్ వాదించారు. పవన్ కుమార్ గుప్తా కూడా మైనరే అయినప్పటికీ.. అతనికి వయస్సును నిర్ధారించే పరీక్షలు చేయలేదని చెప్పారు.
24వ తేదీకి వాయిదా..
పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు తీసుకుంది ఢిల్లీ హైకోర్టు. వాదనలను విన్న అనంతరం ఈ కేసును వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటీషన్ లో తన అభిప్రాయాలను వెల్లడించాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. దీనితో- నిర్భయ కేసులో దోషుల ఉరితీయడంలో మరింత జాప్యం ఏర్పడటం అనివార్యంగా మారినట్టు కనిపిస్తోంది.