భారత్కు రుణపడి ఉంటా: పాక్ గాయకుడు అద్నాన్
న్యూఢిల్లీ: తనకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వడం పట్ల ప్రముఖ పాక్ గాయకుడు అద్నాన్ సమీ సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వానికి తాను రుణపడి ఉంటానని చెప్పారు. ఇక్కడి ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారన్నారు.
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ప్రభుత్వం తనకు విలువైన, అందమైన కానుక ఇచ్చిందన్నారు. తన భార్యతో కలసి ఢిల్లీలో శుక్రవారం హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును అద్నాన్ సమీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత పౌరసత్వం పత్రాలను సమీకి మంత్రి అందజేశారు.
జనవరి 1న భారత పౌరసత్వ పత్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని అనంతరం మీడియాకు తెలిపారు. వాటిని స్వీకరించడానికి ఇంతకన్నా మంచిరోజు ఉండదని పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ లో జన్మించిన అద్నాన్... 2001, మార్చిలో మొదటిసారి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి తాత్కాలిక వీసాపై భారత్ కు వస్తూపోతూ ముంబైలో ఉంటున్నారు. తాజాగా ఆయనకు శాశ్వతంగా పౌరసత్వం లభించింది.
పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీకి కేంద్రం మానవతా దృక్పథంతో భారత పౌరసత్వం మంజూరు చేసింది. జనవరి 1 నుంచి సమీ అధికారికంగా భారత పౌరుడు అవుతారని గురువారం కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
లాహోర్కు చెందిన అద్నాన్ సమీ 2001 మార్చి 31న ఏడాది గడువు కలిగిన సందర్శక వీసా పైన భారత్ వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వీసా గడువు పెంచుతోంది. ఇటీవల శాశ్వత వీసాను కూడా ఇచ్చింది. 2015 మే 26న పాస్పోర్టు కాలంచెల్లడంతో చట్టబద్ధంగా భారత్లో నివసించేందుకు మానవతాదృక్పథంతో పౌరసత్వం ఇవ్వాలని ఆయన హోంశాఖను కోరారు.