‘భారతీయ కుక్కలు’: కువైట్పై అద్నాన్ సమి ఆగ్రహం, సుష్మాజీ గర్వకారణంటూ ప్రశంస
Recommended Video
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి, అతని బృందానికి కువైట్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. సంగీత కచేరీ నిమిత్తం అద్నాన్ తన బృందంతో కలిసి ఆదివారం కువైట్ వెళ్లారు. అయితే, అక్కడి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని 'భారతీయ కుక్కలు' అని అవమానించారట.
కువైట్ అధికారులపై ఆగ్రహం
ఈ మేరకు విషయాన్ని అద్నాన్ సమీ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ కువైట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కువైట్లోని భారత దౌత్య కార్యాలయానికి ట్వీట్ చేశారు.
భారతీయ కుక్కలంటూ..
‘ఎంతో ప్రేమతో మీ నగరానికి వచ్చాం. కానీ, మీరు మాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అకారణంగా కువైట్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మా వాళ్లని భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యల చేశారు. ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పొగరుగా ప్రవర్తించడానికి వారికి ఎంత ధైర్యం?' అని అద్నాన్ సమి తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచి మనసున్న సుష్మా
ఈ ట్వీట్పై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. ‘మీరు నాతో ఫోన్లో మాట్లాడండి' అని సమికి ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి బదులిస్తూ.. ‘మంచి మనసున్న సుష్మా స్వరాజ్కు నా ధన్యవాదాలు. ఆమె అర్థం చేసుకుని నాకు, నా బృందానికి సాయం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మనకు వెంటనే సాయం చేసే సుష్మ.. మన విదేశాంగ మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉంది' అని అద్నాన్ సమి వ్యాఖ్యానించారు.
డైనమిక్ విదేశాంగ మంత్రి..
కాగా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ విషయంపై స్పందించారు. సమి బృందానికి ఎదురైన చేదు అనుభవం తనను బాధకు గురిచేసిందన్నారు. మన డైనమిక్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీకు కావాల్సిన సహాయం అందించగలరని తెలిపారు. వెంటనే ఆమెతో మాట్లాడాలని కోరారు. కాగా, పాకిస్థాన్ దేశానికి చెందిన అద్నాన్ సమి.. గత కొంత కాలం క్రితం భారతీయ పౌరసత్వం పొందారు. తనకు భారత్ అంటే ఇష్టమని, ఇక్కడి పౌరుడిగా ఉండటానికి గర్వపడతానని ఆయన చెప్పారు.