పాకిస్తాన్లో ముస్లింలవి చెత్త బతుకులు.. ఇండియాలోనేమో విధేయత పోజులు.. అద్నాన్ సమీ సంచలన వ్యాఖ్యలు
'పద్మశ్రీ' వివాదం సర్దుమణుగుతున్న సమయంలోనే సింగర్ అద్నాన్ సమీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ నుంచి బాధితుల్ని స్వదేశాలకు తరలించే విషయంలో భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు వ్యవహరిస్తోన్నతీరును ప్రస్తావిస్తూ.. రెండు దేశాల్లో ముస్లింల మధ్య ఉన్న తేడాల్ని ఆయన వివరించారు. ఆ క్రమంలో సమీ వాడిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటంతో అక్కడ చిక్కుకుపోయిన సుమారు 600 మంది భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. కాగా, వూహాన్ లో భారతీయులతోపాటే చదువుకుంటోన్న బంగ్లాదేశీ విద్యార్థుల్ని కూడా ఆ దేశ ప్రభుత్వం ఆదుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ విద్యార్థుల్ని తీసుకెళ్లడానికి ఇప్పటిదాకా ముందుకురాలేదు. తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పాక్ విద్యార్థులు పోస్టు చేసిన వీడియోలను సమీ షేర్ చేశారు.
ఇండియాను చూసి సిగ్గుతెచ్చుకోండి..
‘‘నమస్తే, మేం వూహాన్ లో చదువుకుంటోన్న పాకిస్తానీయులం. కరోనా వైరస్ ధాటికి ఇక్కడ పరిస్థితి భయంకరంగా మారింది. మాతోపాటే చదువుకుంటోన్న భారతీయ విద్యార్థుల్ని వాళ్ల ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. మా ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా స్పందించలనేలేదు. చస్తే చావండి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కనీసం ఇండియాను చూసైనా మా దేశ పాలకులు సిగ్గు తెచ్చుకోవాలి‘‘అంటూ పాకిస్తానీ విద్యార్థులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
సమీ ఏమన్నారంటే..
చైనాలో పాక్ విద్యార్థుల దుస్థితికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అద్నాన్ సమీ ఇలా రాసుకొచ్చారు.. ‘‘ఇండియాలో ముస్లింలు తమ జీవితాంతం దేశానికి విధేయులుగా ఉన్నామని.. ఇంకా చాలా రకాలుగా పోజులుకొడుతుంటారు. పాకిస్తాన్ మాత్రం ముస్లింలకు ఏం ఒరిగింది? అక్కడి ప్రభుత్వం వాళ్లను విసిరిపారేసే చెత్తలాగా చూస్తోంది. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం''అని వ్యాఖ్యానించారు. చైనాలో చిక్కుకుపోయిన పాక్ విద్యార్థుల్ని అక్కడి ప్రభుత్వం కాపాడాలని కోరుకోవడం మంచిదే అయినా.. ఆ ప్రకటనలో ఇండియన్ ముస్లింల ప్రస్తావన ఎందుకంటూ సమీని కొందరు నెటిజన్లు విమర్శించారు. సమీ మాత్రం తాను ఉన్నమాటే అన్నానని వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.