రాజస్థాన్లోని సోడా గ్రామంకు వరుస దెబ్బలు..దాతల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు
న్యూఢిల్లీ : అసలే దేశం కరోనావైరస్ విజృంభణతో తల్లడిల్లిపోతోంది. ఈ మహమ్మారి దాడితో ఎవరు ఎవరికి కాకుండా పోతున్నారు. తృప్తిగా కలిసి మాట్లాడుదామన్నా కలిసి భోజనం చేద్దామన్న కరోనా దెబ్బకు దూరమైపోతున్నారు. దీంతోనే ప్రజలు సతమతమవుతూ ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా తయారైంది పరిస్థితి. అసలే కరోనాతో పరిస్థితి కకావికలం అవుతోంటే ఇదే సమయంలో భానుడు ఉగ్రరూపం దాల్చడం, ఆపై మిడతల బెడద దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ఈ కరోనావైరస్, మిడతల బెడద, వడగాలులతో గ్రామీణ భారతం తీవ్రంగా నష్టపోయింది.
రాజస్థాన్లోని సోడా అనే గ్రామంలో ఇదే పరిస్థితి తలెత్తింది. సోడా గ్రామం మాజీ సర్పంచ్ చవ్వి రజావత్ ఒక వినూత్నమైన ఆలోచనతో వచ్చారు. కష్టకాలం ఎదుర్కొంటున్న ఆ గ్రామంలో ప్రతి ఒక్కరం ఒక కుటుంబాన్ని కనుక దత్తత తీసుకుంటే ఆ గ్రామాన్ని కాపాడగలిగిన వారమవుతాము. ఈ వినూత్నమైన ఆలోచనతో వచ్చిన మాజీ సర్పంచ్ చవ్వ రజావత్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉన్న తొలి సర్పంచ్గా దేశంలో నిలిచారు. ఆమె నేతృత్వంలోనే సోడా అనే ఈ గ్రామం రూపాంతరం చెందింది. అక్కడ ఉన్న 900 కుటుంబాల కోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే వన్ ఇండియా రజావత్ను కలిసి ఆ గ్రామ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోడా గ్రామంలో ఉండేందుకు సరైన వసతులు లేవని చెప్పిన రజావత్.. అంతా గ్రామం వీడి వెళుతున్నారని చెప్పారు. తమ గ్రామంలో కరోనావైరస్ మహమ్మారి, ఎండవేడిమి, తాగేందుకు నీరు ఇలా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. సరైన వనరులు కూడా లేవని చెప్పారు. కానీ తన గ్రామం అంటే తనకు చాలా ఇష్టమని ఆ గ్రామంతో తనకు సుదీర్ఘ అనుభవం ఉందని వెల్లడించారు. ఇలాంటి దుస్థితిలో స్థానికులు లేదా గ్రామస్తులు ఎలా జీవిస్తారని ప్రశ్నిస్తోంది. తన తల్లిదండ్రులు తనను బాగా చదివించారని అయితే తన గ్రామం ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఎదుర్కొంటుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చారు.
తను పెరిగే సమయంలో కూడా తన తాతగారింట్లో టిఫిన్ చేసి గ్రామంలోకి అడుగుపెట్టేదాన్నంటూ గుర్తుచేసుకున్నారు రజావత్. తిరిగి తన ఇంటికి సాయంత్రం మాత్రమే చేరుకునేదాన్నంటూ గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలోని 900 కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు గ్రామస్తులు గ్రామం వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లి పేదరికం నుంచి బయటపడి మంచి భవిష్యత్తు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఇక వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉండటంతో తాగునీరు లేక ఇటు మనుషులకు అటు పశుపక్ష్యాదులకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఏటా జూన్ - జూలై నెలలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని దీనికి తోడు ఈ సారి కోవిడ్-19 మరింత దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలోనే వన్ ఇండియా సోడా గ్రామస్తులను పలకరించింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. వారు బతికేందుకు నెలకు రూ. 3వేలు సరిపోతాయని గ్రామస్తులు చెప్పారు. ఇక వీరి కష్టాల నుంచి గట్టెక్కించి కాస్త ఊరటనిచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నామని రజావత్ చెప్పారు. ఇప్పటి వరకు 140 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక మిగతా కుటుంబాలు కూడా ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు villagesoda.org అనే వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని రజావత్ కోరుతున్నారు. విరాళాలు ఇచ్చేవారికి సెక్షన్ 80 జీ కింద మినహాయింపులు ఉంటాయని వారికి రసీదు కూడా ఈ-మెయిల్ ద్వారా జారీ చేయడం జరుగుతుందని రజావత్ వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారుల ఫోటో కూడా పంపడం జరుగుతుందని చెప్పారు. 10 ఏప్రిల్ 2020న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ జూలై 30తో ముగియనుంది.
ఇక పేదరికంలో మగ్గుతున్న ఆ 900 కుటుంబాలను ఎలా గుర్తించారో అనేదానిపై రజావత్ వివరణ ఇచ్చారు. మెజార్టీ వారికి సొంత భూమి లేదని మధ్య చిన్న తరహా రైతులకు లాభాలు ఉండవని చెప్పారు. భూమి లేనివారు, అత్యంత పేదరికంలో ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసినట్లు చెప్పారు. సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాల వారిని ఎంపికచేసి వారిస్థితిగతుల ఆధారంగా సెలెక్ట్ చేసినట్లు చెప్పారు. బంజారాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఇందులో కొందరు ఒంటరి వారు కూడా ఉన్నారని వారికి కూడా సహాయం అందించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొందరు వీరిని ఆదుకునేందుకు ముందుకొచ్చారని చెప్పిన రజావత్... అదే వారికి కొండంత బలమని చెప్పారు. ఇక వారిని ఆదుకునేందుకు కొందరు తమ వెనక ఉన్నారన్న నిజం వారికి ధైర్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. రైతులు ఆనందంగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పారు రజావత్. ఇలాంటి పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలదే బాధ్యత కాదని సాటి మనిషిగా మనపై కూడా బాధ్యత ఉంటుందని చెప్పారు. దేశం ముందుకు వెళ్లాలంటే ఇలాంటి వారిని ఆదుకోవడం మన ధర్మం అని రజావత్ చెప్పారు.
సోడా గ్రామంలో కుటుంబాలను దత్తత ఎలా తీసుకోవాలంటే:
* ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటారో ఎంటర్ చేయండి
* ఒక కుటుంబానికి నెలకు రూ.3000 ఖర్చు అవుతుంది
* ఈ-మెయిల్ ఐడీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయండి
ఆ తర్వాత డొనేట్ అనే బటన్ పై క్లిక్ చేయండి
* ఏదైనా సందేహాలుంటే ఈ కింది మెయిల్ ఐడీకి పంపండి: [email protected]
ఒక చిన్న విరాళం రాజస్థాన్ సోడా గ్రామంలోని ఒక కుటుంబాన్ని ఆదుకుంటుంది. మార్పును ఇక్కడ నుంచే మొదలు పెడదాం.