బీజేపీయే టాప్.. రెండేళ్లలో రూ.969 కోట్ల విరాళాలు..
ఢిల్లీ : రాజకీయ పార్టీలు విరాళాలు పొందడం సర్వసాధారణం. అయితే ఆ డొనేషన్లు పొందడంలో తమను మించిన వారు లేరని బీజేపీ నిరూపించింది. కార్పొరేట్ కంపెనీలతో పాటు వ్యాపార సంస్థల నుంచి విరాళాలు పొందడంలో బీజేపీ మిగతా పార్టీలను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్లో నిలించింది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో పార్టీలకు రూ.20వేలకు మించి అందిన విరాళాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ విడుదలచేసిన రిపోర్ట్ ఈ విషయం స్పష్టం చేసింది.
రెండేళ్లలో రూ.969కోట్ల విరాళం
గత రెండేళ్లలో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు రూ. 1059.25 కోట్లు డొనేషన్లు రాగా అందులో 985.18 కోట్లు బీజేపీ ఖాతాలో చేరాయి. అంటే మొత్తం విరాళాల్లో 94శాతం ఆ పార్టీకే దక్కాయి. ఈ మొత్తంలో 93 శాతం నిధులు ఎలక్టోరల్ ట్రస్ట్ల నుంచే వచ్చాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎలక్టోరల్ ట్రస్టులు ఏర్పాటుచేయగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వద్ద 21 రిజిస్టర్డ్ ట్రస్టులున్నాయి. ఇవి కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించి ఆ డబ్బును నేరుగా పార్టీల ఖాతాలకు తరలిస్తాయి.
ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 94 శాతం
2016-18 మధ్యకాలంలో బీజేపీకి 969.31 కోట్ల విరాళాలు రాగా.. అందులో 94 శాతం ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే వచ్చాయి. సంఖ్యాపరంగా మొత్తం 1731సంస్థలు వ్యక్తుల నుంచి బీజేపీకి డొనేషన్లు వచ్చాయి. గత రెండేళ్లలో కార్పొరేట్ల నుంచి బీజేపీకి రూ.915.59 కోట్ల విరాళాలు రాగా.. కాంగ్రెస్కు 68.56 కోట్లు వచ్చాయి. ఆ మొత్తంలో కార్పొరేట్ వాటా రూ.55.36 కోట్లు. మిగతాపార్టీల విషయానికొస్తే ఎన్సీపీకి 8.43 కోట్ల చందాలు అందగా.. అందులో రూ.7.73కోట్లు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చినవే కావడం విశేషం.
సీపీఐకి అతి తక్కువ చందాలు
2016-18 మధ్యకాలంలో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు 2.35కోట్ల విరాళాలు అందాయి. అందులో 86శాతం నిధులు కార్పొరేట్లు చదవించుకున్నవే. ఇక జాతీయ పార్టీల్లో కార్పొరేట్ల నుంచి అతి తక్కువ విరాళాలు పొందిన పార్టీ సీపీఐ. రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆ పార్టీకి రూ.2.59కోట్ల డొనేషన్లు రాగా.. అందులో మెజార్టీ వాటా యూనియన్లదే కావడం గమనార్హం. సీపీఐకి ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి అందిన నిధులు కేవలం 2శాతం మాత్రమే. ఇదిలా ఉంటే జాతీయ పార్టీ అయిన బీఎస్పీ గత రెండేళ్లలో రూ.20వేలకు మించి డొనేషన్లు రాలేదని చెప్పడం కొసమెరుపు.
ఢిల్లీ నుంచే అత్యధిక విరాళాలు
ఎలక్టోరల్ ట్రస్టులు, పర్సనల్ డొనేషన్ల రూపంలో పార్టీలకు అందుతున్న నిధుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ నుంచే వస్తున్నాయి. 2016-18 మధ్య జాతీయ పార్టీలకు అందిన 1059.25 విరాళాల్లో ఢిల్లీ వాటా రూ.481.37కోట్లని ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.