వివాహేతర సంబంధాలు: ‘పురుషులే నేరస్తులు! సెక్షన్ 497 కొనసాగించాల్సిందే’
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలాంటి వ్యవహారాల్లో పురుషుడిని ఖైదు చేసే భారతీయ శిక్షా స్మృతి.. సెక్షన్ 497ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
పురుషుడిని మాత్రమే దోషిగా గుర్తిస్తున్న ఈ సెక్షన్ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్ షైన్ గత సంవత్సరం డిసెంబర్లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని అభిప్రాయపడింది. వివాహం అనే పవిత్ర బంధానికి అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సెక్షన్ను కొనసాగించడం ద్వారానైనా హద్దులు మరచి ప్రవర్తించే కొంతమందినైనా అడ్డుకోవచ్చని తెలిపింది. వివాహేతర సంబంధాలు దేశవ్యాప్తంగా ఎన్నో కాపురాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ సంబంధాలతో కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతోందని పేర్కొంది.