హైదరాబాద్పై నెహ్రూ Vs పటేల్: అద్వానీ మరోసారి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విలీన అంశంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ - జవహర్ లాల్ నెహ్రూల మధ్య విభేదాలను భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని మరోసారి ప్రస్తావించారు. హైదరాబాదులో పోలీసు చర్యకు ముందు అక్కడ భారత ఏజెంట్ జనరల్గా పని చేసిన డాక్టర్ కెఎం మున్షీ 1967లో రాసిన పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని అద్వాని ఉదహరించారు.
హైదరాబాద్ ఉదంతంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మున్షీ రాసిన పుస్తకంలో సాయుధ చర్య గురించి ఉన్న అధ్యాయనం నెహ్రూ - పటేల్ల మధ్య విభేదాలకు నిదర్శనమన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు.
తమ సైన్యంహైదరాబాదు వెళ్లడానికి ముందు రక్షణపై మంత్రివర్గ సంఘం సమావేశాన్ని నెహ్రూ ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి పటేల్ కూడా వచ్చారని మున్షీ పేర్కొన్నారని అద్వాని చెప్పారు.
హైదరాబాద్ విషయంలో పటేల్ వైఖరిపై నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారని, భవిష్యత్తులో హైదరాబాదుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తాను స్వయంగా చూస్తానని చెప్పారని, దానితో అక్కడున్న వారు షాక్ అయ్యారని, పటేల్ మాత్రం మౌనంగా కూర్చున్నారని, నిర్ణయం జరగకుండానే సమావేశం ముగిసిందని మున్షీ పేర్కొన్నారని అద్వానీ బ్లాగులో తెలిపారు.