చరిత్రలో నిలిచిపోతుంది: ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగంపై అద్వానీ ప్రశంస
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తృతీయశిక్షా వర్గ్ ముగింపు సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ ప్రసంశల వర్షం కురిపించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ప్రణబ్ రావడం, జాతీయతపై ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుందని అద్వానీ అన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం
'మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇద్దరూ కూడా దేశానికి ఐక్యత ఆవశ్యకమని చాటిచెప్పారు. సహనం, సామరస్య వాతావరణాన్ని సృష్టించేందుకు, కలల భారతాన్ని నిర్మించేందుకు ఇలాంటి ప్రసంగాలు, సమావేశాలు ఎంతగానో ఉపయోగపడుతాయి' అని అద్వానీ అన్నారు.
ప్రజా జీవితంలో ప్రణబ్కు ఎంతో అనుభవం ఉందని ప్రశంసించారు. అదే ఆయనను రాజనీతజ్ఞుడిని చేసిందని కొనియాడారు. భిన్న సిద్ధాంతాలు, వేర్వేరు రాజకీయ నేపథ్యాలు గల ప్రజల మధ్య సహకారం ఎంతో ముఖ్యమని ఆయన పూర్తిగా విశ్వసిస్తారని చెప్పారు.
గురువారం సాయంత్రం నాగ్పూర్లోని 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయంలో 'శిక్షా వర్గ్'ను ఉద్దేశించి ప్రణబ్ ముఖ్య అతిథిగా ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రణబ్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు కూడా తమదైన శైలిలో మెచ్చుకుంటున్నారు.