ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి: అద్వానీ 'ఎమర్జెన్సీ'పై శివసేన
ముంబై: మరోసారి అత్యవసర పరిస్థితి తలెత్తబోదని చెప్పలేనన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని శివసేన సోమవారం నిలదీసింది. తమ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది.
ఎమర్జెన్సీ గురించి అద్వానీ తనకున్న ఆందోళనను వెల్లడించారంటే ఆయన తప్పకుండా ఎవరినో వేలెత్తి చూపిస్తున్నట్లేనని, ఆయన చెప్పిన ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పరిస్థితికి సంబంధించిన భయాలను ఎలా తొలగించాలన్నది కూడా ముఖ్య విషయమేనని చెప్పారు.
మన దేశంలో రాజకీయ పరిణామ క్రమాన్ని, ఎత్తుపల్లాలను స్వయంగా చూసిన అద్వానీ ప్రస్తుతం ప్రధాన స్రవంతి రాజకీయాల్లో లేకపోయినా ఆయనను బీజేపీ గానీ, మీడియ గానీ పక్కనపెట్టే పరిస్థితి ఉండదని సామ్నాలో పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ తలెత్తి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయగలదని నలభై సంవత్సరాల తర్వాత అద్వానీకి ఎందుకు అనిపించిందని ప్రశ్నించింది. కాగా, అద్వానీ నాలుగు రోజుల క్రితం ఎమర్జెన్సీ మళ్లీ తలెత్తే అవకాశాలు కొట్టిపారేయలేమని చెప్పిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.