రాజీనామాతో బీజేపీలోకి వెళ్లనీయొద్దు: యడ్యూరప్పకు అడ్వోకేట్ ఝలక్, హైకోర్టుకు
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఓ లాయర్ గురువారం హైకోర్టుకు వెళ్లారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అడ్వోకేట్ ఎన్పీ అమృతేష్ హైకోర్టును ఆశ్రయించారు.
గుజరాత్ దెబ్బ కర్ణాటకలో పడింది: దేవేగౌడకు బీజేపీ టిట్ ఫర్ టాట్
జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందని ఆయన తన పిల్లో పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ లేదా రాజీనామాల ద్వారా కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడాన్ని కోర్టు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదని ఆయన కోరారు. ఈ మేరకు కోర్టు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకుముందు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు.
కాగా, బలనిరూపణకు ఆయనకు గవర్నర్ పదిహేను రోజుల గడువు ఇవ్వడం సరికాదని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అంటున్నారు. గవర్నర్ నిర్ణయంపై బుధవారం రాత్రే కాంగ్రెస్ సుప్రీం తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.