కథ మళ్లీ మొదటికొచ్చినట్టేనా? సభా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్
బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో- గవర్నర్ జోక్యం చేసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది.
పని మీద చెన్నై వెళ్లా..గుండెనొప్పితో ముంబై ఆసుపత్రిలో చేరా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన హక్కు గానీ, అధికారం గానీ గవర్నర్ వ్యవస్థకు లేదని కాంగ్రెస్ ఎంపీ నాజిర్ హుస్సేన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ- కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా తన పరిధులను అధిగమించారని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నాటికి తన బలాన్ని నిరూపించుకోవాలని అంటూ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, స్పీకర్ రమేష్కుమార్కు అధికారికంగా లేఖ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్కు లేదని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిందని అన్నారు.
ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణ స్వీకరించిందే నిజమైతే- కుమారస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించేంత వరకూ బలపరీక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోందని చెబుతున్నారు. శాసనసభా వ్యవహారాల్లో ఒక్కసారి గవర్నర్ జోక్యం చేసుకుంటే.. అదొక సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టవుతుందని అంటున్నారు. ఇప్పటిదాకా- ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని ఉదహరిస్తున్నారు.