అఫైర్?: న్యాయవాది కాల్చివేత, ఆస్పత్రిలో చేర్చి ఆమె ఆత్మహత్య
వివాహేతర సంబంధం ఓ న్యాయవాది హత్యకు, ఓ మహిళ ఆత్మహత్యకు దారి తీసింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరు: ఓ న్యాయావాదిని కాల్చి చంపిన సంఘటనలో పోలీసులు 78 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన బెంగళూరులోని పీన్యా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడిని అమిత్ కేశవ్ మూర్తిగా గుర్తించారు. కాల్పులు జరపడంతో అతని శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయాయి. బుల్లెట్ గాయాలకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. అమిత్ హత్య కేసులో పోలీసులు 78 ఏళ్ల గోపాలకృష్ణ గౌడను, అతని కుమారుడిని అరెస్టు చేశారు. కాల్పుల్లో గాయపడిన అమిత్ను శ్రుతి గౌడ ఆస్పత్రిలో చేర్చింది. శ్రుతి గౌడ బంధువు అమిత్పై కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
అమిత్ను ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వెంటనే శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు శ్రుతి వాడిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆమె ఇంటిని కనిపెట్టారు. ఆస్పత్రిలోని కెమెరాల్లో ఆమె ప్రయాణించిన కారు నెంబర్ నమోదైంది.
ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులకు దిగ్భ్రమ కలిగించే సంఘటన ఎదురైంది. ఇంట్లో ఆమె శవం కనిపించింది. తన వైవాహికేతర సంబంధం కుటుంబానికి తెలియడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమిత్ నీలమంగళకు చెందిన న్యాయవాది అని తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.