4 కోట్ల మందికి జబ్బు: స్టంట్ల వర్గీకరణకు నో, మేనేజ్మెంట్లలో ఆందోళన
దేశ ప్రజలకు చౌక ధరలకే ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వారికి వాడే స్టంట్ల ధరలపై పరిమితులు విధించింది.
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు చౌక ధరలకే ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వారికి వాడే స్టంట్ల ధరలపై పరిమితులు విధించింది. పరిమితులు కొనసాగించాలన్న తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది.
బయో అబ్జార్బింగ్ స్టంట్లు, మెటాలిక్ స్టంట్ల ధరలను విభజించాలని ఆయా కంపెనీలు చేసిన అభ్యర్థలను కేంద్రం తిరస్కరించింది. ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం స్టంట్ల ధరలను రూ.1.80 లక్షల నుంచి రూ.29,600లకు తగ్గించాల్సి ఉంటుంది. దీనివల్ల అధిక ధరలు చెల్లించడంతో ఆర్థికపరమైన కష్టాల నుంచి వేల మంది రోగులకు ఉపశమనం లభించినట్లవుతుంది. ప్రభుత్వం విధించిన పరిమితి ప్రకారం ఒక్కో స్టంట్ ధర సగటున ఆరు రెట్లు తగ్గిపోతున్నది.
ఈ నేపథ్యంలోనే ఆయా స్టంట్లను తయారుచేస్తున్న ఔషధ తయారీ పరిశ్రమల యాజమాన్యాలు పరిమితులు, ఆంక్షలను తొలగించాలని పున: పరిశీలించాలని పదేపదే ఒత్తిళ్లు తీసుకొచ్చినా కేంద్ర ఆరోగ్య శాఖ త్రోసి రాజన్నది. స్టంట్ల ధరలపై విధించిన పరిమితులకు కట్టుబడి ఉన్నట్లు గట్టిగా పునరుద్ఘాటించింది. అందరికీ ఆరోగ్య పరిరక్షణ సేవలు అందుబాటులోకి తేవడం కోసం ఔషధ వస్తువులు, పరికరాలను చౌకధరలకే అందించాలన్న కఠిన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పింది.
ఒక సీనియర్ డ్రగ్ నియంత్రణాధికారి మాట్లాడుతూ 'బయో అబ్జార్బింగ్ స్టంట్ల నుంచి మెటాలిక్ స్టంట్లను విభిన్నంగా విడదీయాలని స్టంట్ల తయారీ సంస్థల యాజమాన్యాల నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. ఇటీవలే స్టంట్ల ధరలను రూ.1.80 లక్షల నుంచి రూ.29,600లకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన ధర ఇప్పటివరకు ఉన్న ధరలో ఆరోవంతు మాత్రమే. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరలో కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ధర 85 శాతం తగ్గింది' అని చెప్పారు. దీనిపై నిపుణుల కమిటీ వైఖరిని, సిఫారసులను ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ (ఎస్సార్జీహెచ్) కార్డియాక్ సర్జరీ శాఖాధిపతి డాక్టర్ గణేశ్ రాజ్ శివ్నానీ ప్రశంసించారు.
మూడేళ్ల క్రితమే బయో అబ్జార్బింగ్ స్టంట్లు ఆవిష్కరించినా..
బయో అబ్జార్బింగ్ స్టంట్లను ఔషధ ఉత్పత్తుల తయారీ సంస్థలు మూడేళ్ల క్రతమే ఆవిష్కరించాయి. కానీ ఇవి సంబంధి శస్త్ర చికిత్సా వైద్యులకు సహాయకారిగా, స్నేహ పూర్వకంగా ఉంటాయని ఇంకా రుజువు కాలేదు. ప్రస్తుతం వీటి వినియోగంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు వైద్యులు. గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శస్త్ర చికిత్స చేసేందుకు మెత్తని వైర్లతో కూడిన మెష్ ట్యూబ్లను వైద్యులు విస్త్రుతంగా వినియోగిస్తున్నారు.
బయో అబ్జార్బింగ్ స్టంట్లు రెండేళ్లకే మాయపై రక్తనాళాలు స్తంభించి పోతున్నాయి. ప్రస్తుత దశలో బయో అబ్జార్బింగ్ స్టంట్లను మరింత మెరుగ్గా అభివ్రుద్ధి చేసే వరకు మెటాలిక్ స్టంట్లు మాత్రమే రక్త నాళాలతో అనుసంధానమై గుండె సంబంధ వ్యాధిగ్రస్తుల చికిత్సలో ఉపయుక్తంగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కార్డియో వాస్కులర్ వ్యాధులకు చికిత్స పొందిన రోగుల్లో మెటాలిక్ స్టంట్లు వేసుకున్న వారిలో అవి స్థిరంగా నిలిచిపోయాయని పేర్కొంటున్నారు.
4 కోట్ల మందికి గుండె జబ్బు
ప్రతిఏటా దేశవ్యాప్తంగా 1.75 కోట్ల మంది గుండె పోటు, కార్డియో వాస్కులర్ వ్యాధులతో మరణిస్తున్నారు. ఏటా నాలుగు కోట్ల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధ పడుతున్నారు. వారిలో 1.9 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో, 2.1 కోట్ల మంది గ్రామాల్లో గుండె సంబంధ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ భారతంలో గుండె జబ్బులు అంటు వ్యాధులుగా ప్రబలుతున్నాయని, వీటికి సంస్థాగత పరిష్కార మార్గం చూపాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
దేశ ప్రజలందరికీ చౌక ధరలకే ఔషధాలు, ఆరోగ్య పరికరాలు అందుబాటులోకి తేవడానికి అవసరమైన మార్గాలను కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య వ్యవస్థీక్రుత వనరుల కేంద్రం (ఎన్హెచ్ఆర్సీ) అన్వేషిస్తున్నది. ఆమోదయోగ్యమైన ధరలకే ఔషధాలు అందుబాటులోకి తేవాలని జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తెలిపింది. కార్డియాక్ స్టంట్ల ధరలపై పరిమితులు విధించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. కళ్లలో ఇమిడ్చే కటకాలపై, కీళ్లలో అమర్చే ఇంప్లాంట్ల ధరలపై పరిమితులు విధించాలని తలపోస్తున్నది. ఈ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకుంటే వేల మంది రోగులకు ఉపశమనం లభిస్తుంది.