జయను ఆసుపత్రిలో చూడనివ్వలేదు, శశికళంటే భయం: మంత్రి శ్రీనివాసన్ సంచలనం
చెన్నై: అపోలో ఆసుపత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స తీసుకొనే సమయంలో ప్రజలకు అబద్దాలు చెప్పినట్టు తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అపోలో ఆసుపత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స సమయంలో ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ రహస్యాలను బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం పాటు తాము నోరు మెదపలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే జయలలిత చికిత్స సమయంలో సీసీ పుటేజీని బయటపెడతామని అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన దినకరన్ ప్రకటించడం సంచలనం కల్గిస్తోంది.
అబద్దాలు చెప్పాం
శశికళకు భయపడి దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఏఐఏడీఎంకే నాయకులు అబద్ధాలు చెప్పారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ కోలుకుంటున్నారని ప్రజలను నమ్మించడానికే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయను కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదని, కలుసుకోవాలని వచ్చిన వారికి జయ బాగానే ఉన్నారని చెప్పి శశికళ బంధువులు పంపించేవారన్నారు.
క్షమించాలని వేడుకొన్న మంత్రి శ్రీనివాసన్
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంలో అబద్ధాలు చెప్పినందుకు క్షమించాలని వేడుకున్నారు. మదురైలో శుక్రవారం ఓ సభలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దయచేసి నన్ను క్షమించండి. అమ్మ ఇడ్లీ, సాంబార్, చట్నీ తింటున్నారని అబద్ధాలు చెప్పాం. ఆమె ఇడ్లీ తింటుండగా, టీ తాగుతుండగా మేమెవరం చూడలేదని శ్రీనివాసన్ చెప్పారు.
పార్టీ రహస్యాలు బయటకు రాకూడదనే అలా..
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అబద్దాలు చెప్పడానికి కారణం ఉందన్నారు. జయలలిత ఆరోగ్యంపై తాము చెప్పినవన్నీ కట్టుకథలేనన్నారు.. జయతో పలువురు నాయకులు సమావేశమయ్యారని, ఆమె కోలుకుంటున్నారని చెప్పినవన్నీ అబద్ధమని శ్రీనివాసన్ చెప్పారు.పార్టీ రహస్యాలు బయటికి రాకూడదనే అబద్ధాలు చెప్పాం' అని అన్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
తమిళనాడు రాజకీయాల్లో మంత్రి శ్రీనివాసన్ వ్యాఖ్యలు సంచలనంగా మారింది.జయలలిత చికిత్స చేసే సమయంలో మంత్రులు, పార్టీ నేతలు చేసిన ప్రకటనలన్నీ అవాస్తవమేని మంత్రి శ్రీనివాసన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జయలలిత మరణంపై ఆ సమయంలో వచ్చిన ఆరోపణలకు శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఊతమిచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.