Bengaluru: ఐటీ హబ్ లో విదేశీయుడి లాకప్ డెత్ ?, వీసా గడుపు పూర్తి అయినా మకాం, కస్టడిలో ప్రాణం !
బెంగళూరు: డ్రగ్స్ విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్న విదేశీయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికన్ జాతీయులు గుమికూడి పోలీసుల మీద దాడికి ప్రయత్నించడంతో లాఠీచార్జ్ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న యువకుడు అనారోగ్యంతో మరణించాడని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. వీసా గడువు పూర్తి అయినా అక్రమంగా ఐటీ హబ్ లో మకాం వేసిన ఆఫ్రికన్ యువకుడు అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ సౌముందు ముఖర్జీ అంటున్నారు.
Illegal affair: కత్తిలాంటి పెళ్లానికి కన్నింగ్ బుద్ది, భర్తను చంపేస్తే అతని ఉద్యోగం, ప్రియుడు ఫ్రీ !
డ్రగ్స్ తో పట్టుబడిన యువకుడు
బెంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆఫ్రికన్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీసా గడుపు పూర్తి అయిపోయినా బెంగళూరులో అక్రమంగా మకాం వేసిన విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 38 మంది ఆఫ్రికన్స్ లో డ్రగ్స్ విక్రయిస్తూ 27 ఏళ్ల ఆఫ్రికన్ బెంగళూరులోని జేసీ నగర్ పోలీసులకు చిక్కాడు.
అనారోగ్యంతో మృతి ?
పోలీసుల అదుపులోకి తీసుకున్న యువకుడిని మూడు గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. అనంతరం ఛాతి నొప్పిగా ఉందని ఆ యువకుడు చెప్పడంతో వెంటనే అతన్ని చిరాయు ఆసుపత్రికి తరలించామని, రెండు గంటల తరువాత అతను చికిత్స విఫలమై మరణించాడని బెంగళూరు అడిషనల్ పోలీసు కమీషనర్ సౌముందు ముఖర్జీ మీడియాకు చెప్పారు.
నిందితుడి పేరు చెప్పిన పోలీసులు
పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి పేరు తెలీదని మొదట పోలీసులు చెప్పారు. బెంగళూరులోని ఆఫ్రీకన్ జాతీయుల అసోసియేషన్ నాయకులతో చర్చించిన తరువాత పోలీసు కస్టడీలో ఉంటూ మరణించిన నిందితుడి పేరు జాన్ అలియాస్ జోయిల్ శిందాని మలు (27) అని వెలుగు చూసిందని బెంగళూరు అడిషనల్ పోలీసు కమీషనర్ సౌముందు ముఖర్జీ మీడియాకు చెప్పారు.
లాఠీచార్జ్
ఆఫ్రీకన్ యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఆఫ్రికన్ జాతీయులు జేసీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల మీద ఆఫ్రికన్ జాతీయులు దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. ఆఫ్రికన్లు దాడి చెయ్యడంతో ఎస్ఐ తోపాటు ఇద్దరు పోలీసులకు గాయాలైనాయి.
ఆఫ్రికన్ యువకుడి జోబులో డ్రగ్స్
ఆత్మరక్షణ కోసం పోలీసులు లాఠీచార్జ్ చేశారని బెంగళూరు అడిషనల్ పోలీసు కమీషనర్ సౌముందు ముఖర్జీ మీడియాకు చెప్పారు. పోలీసుల లాకప్ డెత్ లో చనిపోయిన జాన్ కేసు విచారణ సీఐడీ పోలీసులకు అప్పగించారు. పోలీసు కస్టడీలో ఉంటూ మరణించిన జాన్ దగ్గర ఐదు గ్రాముల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.