మద్యం మత్తులో ఆఫ్రికా దేశస్తుల హంగామా: విదేశీయులపై కేసు నమోదు!
బెంగళూరు: మద్యం మత్తులో నిత్యం న్యూసెన్స్ చేస్తూ చుట్టు పక్కల ఉంటున్న మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నారని విదేశీయుల మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తన మీద దాడి చేశారని ఆఫ్రికా దేశస్తుడు జాన్ అనే వ్యక్తి స్థానికుల మీద కేసు పెట్టడంతో ఉద్రిక్తత తలెత్తింది.
బెంగళూరులోని భైరతి ప్రాంతం సమీపంలో బ్లైసింగ్ గార్డెన్ ఉంది. ఈ ప్రాంతంలో ఆఫ్రికా దేశస్తులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. కొందరు విద్యాభ్యాసం, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు నిత్యం ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఆఫ్రికా దేశస్తులను భ్లైసింగ్ గార్డెన్ దగ్గరకు పిలుచుకుని వస్తున్నారు.
అర్దరాత్రి వరకు పీకలదాక మద్యం సేవించి కేకలు వేస్తూ చుట్టు పక్కల వారికి నిద్రలేకుండ న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఇరువర్గాల మద్య అనేకసార్లు గొడవ జరిగింది. మంగళవారం ఈ గొడవ పెద్దదయింది. దీంతో స్థానికులు వారి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో ఆఫ్రికా యువకులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నారని స్థానిక మహిళలు, యువతులు ఈశాన్య విభాగం డీసీపీ వికాస్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎక్కడ కేసు నమోదు చేస్తారో అని భావించిన ఆఫ్రికా దేశస్తులు తమ మీద స్థానికులు దాడి చేశారని జాన్ అనే వ్యక్తి దగ్గర పోలీసులకు ఫిర్యాదు చేయించారని వాదనలు వినిపిస్తున్నాయి. పరస్పరం కేసులతో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ముందు జాగ్రతచర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.