19 ఏళ్లు వేచి చూశారు.. లాభంలేదని, గ్రామస్థులే కొండపై నుంచి రోడ్డేసుకున్నారు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా సయూరిమల్లి గ్రామానికి చెందిన వారు కొండ ప్రాంతం నుంచి రోడ్డు వేసుకున్నారు. దాదాపు 19 ఏళ్ల పాటు ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూశారు. కానీ లాభం లేదు. చివరకు గ్రామస్థులే కలిసి ఆ కొండ ప్రాంతం నుంచి తమ గ్రామానికి కచ్చా రహదారిని వేసుకున్నారు.
బీహార్కు చెందిన దర్శన్ మాంఝీ అనే వ్యక్తి ఏళ్ల తరబడి కష్టపడి ఓ పెద్ద కొండను తవ్వేసి తమ గ్రామంలోకి రవాణా సౌకర్యాలు కల్పించాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సయూరిమల్లి గ్రామస్థులు ఈ పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభించి రెండు వారాలు అవుతోంది. ఇప్పటి వారు 150 మీటర్ల రోడ్డు పనులు పూర్తి చేశారు.
తమ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం రోడ్డు నిర్మిస్తుందని దాదాపు ఇరవై ఏళ్లుగా ఆ గ్రామస్థులు వేచి చూస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు కానీ ముందుకు కదల్లేదు. దీంతో కచ్చా రోడ్డు నిర్మించుకోవాలని గ్రామస్థులు నిర్ణయానికి వచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి సమయం, ఖర్చు అవుతుంది. కాబట్టి గ్రామస్తులు పార, కొడవలి, గునపం పట్టి ప్రతిరోజు కాసేపు పని చేసి రోడ్డు పనులు చేసుకుంటున్నారు.
రోడ్డు సదుపాయం లేకుంటే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఉంటాయని, ఆసుపత్రికి వెళ్లాలన్నా, పాఠశాలలకు వెళ్లాలన్నా తమకు ఇబ్బంది అవుతోందని చెప్పారు. ఈ కారణంగా ఇప్పటికే గ్రామం నుంచి 50 కుటుంబాలు మరో ప్రాంతానికి తరలి వెళ్లాయన్నారు. ఆసుపత్రులకు వెళ్లాలంటే మరీ ఇబ్బంది అవుతోందన్నారు.