ఇప్పటికే ఇద్దరు: బీహార్లో మరో ఇంజనీర్ హత్య
పాట్నా: బీహార్లో మరో ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. ఇంతకు ముందు దుండగులు ఇద్దరు ఇంజనీర్లను కాల్చి చంపారు. తాజాగా మరో ఇంజనీర్ను గొంతు పిసికి చంపారు. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తేవాలని సీఎం నితీష్ కుమార్ ఇటీవలే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేరాలు ఆగడం లేదు
తాజా ఘటన బీహార్ రాజధాని పాట్నాకు 60 కిలోమీటర్ల దూరంలోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. రిలయన్స్ టెలికాం సంస్థలో క్వాలిటీ ఇంజినీర్గా పని చేస్తున్న అంకిత్ ఝాను దారుణంగా హత్య చేశారు. ఝాను క్రిమినల్స్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఝా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
సోమవారం రాత్రి వ్యాపారి సంతోష్ అగర్వాల్ను ఇద్దరు వ్యక్తులు రివాల్వర్తో కాల్చిచంపారు. ఈ దారుణం ముజఫర్ జిల్లాలోని అహీపూర్లో చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఇద్దరు ఇంజినీర్లను మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన దర్బాంగా జిల్లాలో జరిగింది. ఈ జంట ఇంజినీర్ల హత్య కేసులో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం రాత్రి తన సోదరుడు పని మీద బయటకు వెళ్లాడని ఝా సోదరుడు చెప్పాడు. కంపెనీ కారు బయట తన కోసం ఉందని చెప్పాడని, తాను ఆఫీసు పని మీద వెళ్తున్నాడని అనుకున్నానని, ఉదయం ఫోన్ చేస్తే స్విఛాప్ చేసి ఉన్నాయని, తాము అతని జాడ కోసం గాలిస్తుండగానే పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు.