20కి 40.. సంతలో బేరం కాదు.. 20 రూపాయల కేసుకు 41 ఏళ్లు
గ్వాలియర్ : 20కి 40.. ఇదేదో సంతలో బేరం కాదు. 20 రూపాయల చోరీ కేసు తేల్చడానికి 41 ఏళ్లు పట్టిన ఉదంతమిది. గ్వాలియర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడెప్పుడో 1978లో నమోదైన కేసు మొత్తానికి 41 సంవత్సరాల తర్వాత పరిష్కారానికి నోచుకుంది.
ప్రస్తుతం 64 సంవత్సరాల వయస్సున్న బాబులాల్ 1978వ సంవత్సరంలో బస్సులో ప్రయాణించాడు. కండక్టర్ నుంచి టికెట్ కొనుగోలు చేసే సమయంలో ఇస్మాయిల్ (ప్రస్తుత వయసు 60) అనే వ్యక్తి తన జేబులో నుంచి 20 రూపాయలు కొట్టేశాడని అప్పట్లో బాబులాల్ కేసు ఫైల్ చేశాడు. అయితే అప్పటి కేసు ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయిందన్నమాట.
నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్ నిండు ప్రాణం మింగేసింది..!
బాబులాల్ ఫిర్యాదుతో అప్పట్లో ఇస్మాయిల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కొద్ది నెలల పాటు జైలుశిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకొచ్చాడు. అనంతరం తరచుగా కోర్టు విచారణకు హాజరవుతూ వచ్చాడు. అదలావుంటే 2004నుంచి మాత్రం అతడు కోర్టు విచారణకు రావడం లేదట. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇస్మాయిల్ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది.
ఇక అప్పటినుంచి ఇస్మాయిల్ జైలు జీవితానికే పరిమితమయ్యారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో బెయిల్ ఇప్పించడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దాంతో ఇస్మాయిల్తో పాటు పిటిషనర్ బాబులాల్ను పిలిపించి లోక్ అదాలత్లో విచారణ చేపట్టిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తుది తీర్పు వెలువరించారు. ఇకపై ఎలాంటి నేరాలు చేయబోనంటూ ఇస్మాయిల్ నుంచి రాతపూర్వక హామీ పత్రం తీసుకుని వదిలిపెట్టారు. మొత్తానికి ఆ 20 రూపాయల చోరీ కహానీ ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిందన్నమాట.