దీన్దయాల్ డెత్ మిస్టరీ: యోగీ సర్కార్ సీబీఐ ఎంక్వైరీ వేసే అవకాశం
లక్నో: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతకర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ మిస్టరీ మరణంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25, 1968లో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, ముఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆయన ఎలా చనిపోయారో ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలింది. ఎవరైన హత్య చేశారా లేదా ప్రమాదంలో మరణించారా అన్నది ఇప్పటి వరకు సస్పెన్స్గానే మిగిలిపోయింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం అంబేడ్కర్ నగర్కు చెందిన బీజేపీ కార్యకర్త రాకేష్ గుప్తా, దీన్దయాళ్ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిజనిజాలు వెలికి తీయాలని కేంద్ర హోంశాఖకు గతేడాది లేఖ రాశాడు. ఈ మృతి వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగే ఉంటుందన్న అనుమానాన్ని రాకేష్ లేఖలో వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. అంతేకాదు అలహాబాద్ రైల్వే ఎస్పీని విచారణ చేయాల్సిందిగా కోరింది. ఈ క్రమంలోనే దీన్దయాళ్ ఉపాధ్యాయ మృతికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు, ఎఫ్ఐఆర్ అన్నీ అదృశ్యమయ్యాయని అలహాబాద్ రైల్వే ఎస్పీ కేంద్ర హోంశాఖకు తెలిపారు.
ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్లోని రిజిస్టర్ను పరిశీలిస్తే దీన్దయాళ్ ఉపాధ్యాయ మృతికి సంబంధించిన కేసులో ముగ్గురు అరెస్టు అయ్యారని అందులో ఒకరు నాలుగేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11,1969లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైందని... కేసు నంబర్ 67/1968 గా రికార్డ్ అయినట్లు అలహాబాద్ రైల్వే ఎస్పీ తెలిపారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు రామ్ అవద్, లల్తా, భరత్ రామ్లను అరెస్టు చేయడం జరిగింది. 1969లో భరత్ రామ్ను నిందితుడిగా చేరుస్తూ ఐపీసీ సెక్షన్ 379/411 కింద నాలుగేళ్లు జైలు శిక్ష విధించడమైందని మిగతా ఇద్దరు నిర్దోషులుగా బయటపడ్డట్లు ఎస్పీ తెలిపారు.