6 రోజులు సజీవంగా: కోమాలో హనుమంతప్ప, మోడీ పరామర్శ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో పదిమంది ఆర్మీ జవాన్లలో ఒకరు సజీవంగా బయటపడ్డారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరు రోజులుగా మంచు చరియల కింద సజీవంగానే ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే వారం రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు పది మంది జవాన్లు చిక్కుకున్నారు. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా. లాన్స్ నాయక్ హనమంతప్ప సజీవంగా కనిపించారని, మిగిలినవాళ్లంతా మరణించారని జీఓసీ నార్తన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా మంగళవారం తెలిపారు.
సియాచిన్ ఘటనలో మిగతా తొమ్మిది మంది జవాన్లు మృత్యువాతపడ్డారు. అయితే సహచరులు ఏ ఒక్కరైనా బతికి ఉంటారన్న ఆశతో సైనికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 25 ఫీట్ల మంచు కింద హనమంతప్ప రెస్క్యూ సిబ్బందికి సజీవంగా కనిపించాడు.
దీంతో హనుమంతప్ప కదులుతూ కనిపించగా, మంచు తొలగిస్తున్న సైనికుల్లో ఆనందం చోటుచేసుకుంది. సహచరుల గొంతు వినబడగానే హనుమంతప్ప లేచే ప్రయత్నం చేశారు. వెంటనే అతనిని వారించిన సైనికులు కదలవద్దని సూచించారు. కదిలితే మంచు మీద పడే అవకాశం ఉందని 'గభరావ్ మత్ (గాభరా పడకు)..హమ్ ఆగయ్ (మేము వచ్చేశాం)...శాస్ లేలో (బాగా ఊపిరి పీల్చుకో)'అంటూ సహచరుడికి ఏం చేయాలో సూచించారు.
మంచు తొలగిస్తూనే మరో సహచరుడికి 'ఓయ్...కంబల్ లేకే ఆవ్ తూ (ఓయ్...నువ్వు రగ్గు తీసుకునిరా)' అంటూ హెచ్చరించారు. దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో అతను ప్రాణాలతో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
ప్రస్తుతం హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆయనను వెంటనే ఆర్మీకి చెందిన ఆర్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. వెంటీలేటర్పై ఉన్న హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిపై మరో 48 గంటలవరకూ ఏమీ చెప్పలేమని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
ఆయన బ్లడ్ ప్రషర్ పడిపోయింది. లివర్, కిడ్నీపాడైపోయాయని తెలుస్తోంది. హనుమంతప్ప కాపాడేందుకు వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారు. అటు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా హనుమంతప్ప కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న హనమంతప్ప కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
కర్ణాటకకు చెందిన లాన్స్ నాయక్ హనమంతప్ప కొండ చరియలు విరిగిపడిన సమయంలో అక్కడే విధుల్లో ఉన్నాడు. లాన్స్ నాయక్ హనమంతప్ప కర్ణాటకలోని ధార్వాడ జిల్లాకు చెందిన వాడు. నాలుగైదు రోజులుగా కుటుంబ సభ్యుల ఆందోళనతో ఉన్నారు.
ప్రాణాల నుంచి బయటపడ్డాడని తెలియడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. తన కుమారుడు దేశ రక్షణ కోసమే సైన్యంలో చేరాడని హనమంతప్ప తల్లిదండ్రులు తెలిపారు.
Visuals from rescue efforts in Siachen yesterday after soldiers were buried in an avalanche last week (Source: MoD) pic.twitter.com/koDXI7BI4m
— ANI (@ANI_news) February 9, 2016
ఫిబ్రవరి 3న సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారిని గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఘటనకు సంబంధించి మొత్తం ఐదు మృతదేహాలను వెలికితీశారు.
అందులో నలుగుర్ని గుర్తించారు. కాగా సియాచిన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరు ఉంది. సముద్ర మట్టానికి 19వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. చలిని తట్టుకోలేక చాలా మంది సైనికులు ప్రాణాలను కోల్పోతుంటారు. 1980ల నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సుమారు 869 ఆర్మీకి చెందిన ఆఫీసర్లు, జవాన్లు మృత్యువాతపడ్డారు.
ప్రధాని పరామర్శ
ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికుడు హనుమంతప్పను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఢిల్లీ ఆర్మీ చీఫ్తో కలిసి ప్రధాని మోడీ ఆసుపత్రికి వచ్చారు.