ఆకలో రామచంద్రా .. రేషన్ రాక 4 రోజులు ఆకలితో అలమటించి వృద్ధుడి మృతి
జార్ఖండ్ : నవభారతం ఆకలితో అలమటిస్తోంది. శాస్త్ర, విజ్ఞానం ఎంత ఎదిగినా .. పేదోడు మరింత బక్కచిక్కుతూనే ఉన్నాడు. కొన్ని చోట్ల తినడానికి తిండి కూడా దొరక భరతమాత ముద్దుబిడ్డు అల్లాడిపోతున్నాడు. ముదిమి వయస్సులో ఏం పనిచేయలేరు ... ఇచ్చే రేషన్ సరిగా రాక జార్ఖండ్లో 65 ఏళ్ల వృద్ధుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
రేషన్ లేక ...
రేషన్ బియ్యం సక్రమంగా అమలు చేసేందుకు తీసుకొచ్చిన బయోమెట్రిక్ ఆ ఇంటి పెద్ద పాలిట శాపంగా మారింది. డీలర్లు దోచుకుతింటున్నారని బయోమెట్రిక్ తీసుకురావడంతో .. వేలిముద్ర సరిగా పడదు. దీంతో వేలిని నొక్కి .. నొక్కి పట్టాల్సిన పరిస్థితి. అయితే కూలిపనులు చేసేవారికి వేలిముద్ర పోతోంది. దీంతో ఎన్నిసార్లు ఫింగర్ ప్రింట్ పెట్టినా రాని పరిస్ధితి. ఇదే ఆ పెద్దమనిషి ఊపిరితీసేందుకు కారణమైంది. ముదిమి వయసులో రేషన్ రాక .. 4 రోజులపాటు ఆకలితో అలమటించి ఆసువులు బాసిన ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. జార్ఖండ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆకలితో అలమటించి ..
జార్ఖండ్లోని లాటిహర్ జిల్లాకు చెందిన రామచంద్ర ముందా తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు ఉన్నారు. 65 ఏళ్ల వయస్సులో తనకొచ్చే రేషన్ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే గత మూడునెలలుగా రామచంద్రకు రేషన్ రావడం లేదు. కారణం ఏంటంటే ... అతని ఫింగర్ ఫ్రింట్ బయోమెట్రిక్తో మ్యాచ్ కాకపోవడంతో వారు గత కొద్దిరోజులుగా పస్తులుండాల్సిన పరిస్థితి. ఇంట్లో ఉన్న సరుకులు అయిపోవడంతో తినేందుకు ఏం లేని పరిస్థితి నెలకొంది. దీంతో గత నాలుగు రోజులుగా ఇంట్లో పొయి వెలగించని పరిస్థితి. 65 ఏళ్ల వయస్సులో ఏం తినలేక .. ఆకలితో అలమటించి .. కుంగి కృశించి ఆ వృద్ధుడు ఊపిరొదిలాడు. దీంతో ఆ కుటుంబం తమ పరిస్థితిని తలచుకొని బోరున విలపిస్తోంది.
కారణమిదే ?
తన భర్త ఆకలితో అలమటించి చనిపోయాడని భార్య చార్మీదేవి గద్గత స్వరంతో రోదిస్తూ మీడియాకు తెలిపింది. తన తండ్రి గత నాలుగు రోజుల నుంచి ఏం తినలేదని .. తినేందుకు ఇంట్లో ఏం లేక చనిపోయాడని అతని కూతురు తెలుపడం అక్కడున్న వారిని కలచివేసింది. ఈ సమస్యను బుధవారమే స్థానికులు ఎంఎన్ఆర్ జీఏ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే అధికారులు స్పందించి 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అయితే ఆ బియ్యాన్ని తీసుకునేందుకు కుటుంబం నిరాకరించింది. రామచంద్ర బతికున్నప్పుడు ఇవ్వని .. బియ్యం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. బియ్యంతోపాటు . అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.2 వేలను అందచేశారు.
అబ్బే అదేం కాదే ...
అయితే ఈ ఘటనపై అధికారులు ఎప్పటిలాగే స్పందించారు. రామచంద్ర ఆకలితో అలమటించి చనిపోలేదని కొత్త భాష్యం చెప్పారు. అతను ఆకలితో చనిపోయినట్టు రుజువు కాలేదన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ యోజన, రేషన్ కార్డు, పెన్షన్ అందిస్తున్నామని తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. అక్కడ ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్ లైన్ లో సరుకులు ఇస్తున్నామని తన గొప్పను చెప్పుకున్నారు.