స్వేచ్ఛా జీవిని: ఏడు నెలల నిర్బంధం తర్వాత ఫరూక్ అబ్దుల్లా విడుదల
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దాల్లాపై ఉన్న గృహ నిర్బంధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఏడు నెలల నిర్బంధం అనంతరం ఆయన విడుదలయ్యారు. ఆయనపై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ)ను కేంద్రం ఉపసంహరించింది.
కేంద్ర హోంశాఖ సూచన మేరకు గవర్నర్ ఆదేశాలతో ఫరూక్పై ఉన్న నిర్బంధాన్ని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత గవర్నర్ తుది ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
శ్రీనగర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఫరూక్ అబ్దాల్లా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దాల్లాను చాలా మంది నేతలు కలవడానికి ప్రయత్నించారు. చివరకు ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
ఇప్పుడు తాను స్వేచ్ఛా జీవిని అని ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదల తర్వాత వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫరూక్పై పోలీసులు నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న విధించిన పీఎస్ఏని డిసెంబర్ 13 మరో మూడు నెలలపాటు పొడిగించారు.
కాగా, విచారణ లేకుండా మూడు నెలలు లేక అంతకన్నా ఎక్కువ రోజులు నిర్బంధించే ఈ కఠిన చట్టాన్ని సాధారణంగా ఉగ్రవాదులు, రాళ్ల దాడులకు పాల్పడేవారిని నిర్బంధించడానికి ఉపయోగిస్తారు. ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా మరికొంత మంది నేతలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.