హైలీ ఇన్ఫ్లేమబుల్: మైండ్ బ్లాక్ అయ్యేలా పెట్రో రేట్స్: డీజిల్పై రూ.7కు పైగా
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తులు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకించి చెప్పుకనక్కర్లేదు. పెట్రో ప్రొడక్ట్స్కు మండే స్వభావం అధికం. వాటి మీద వీచే గాలి సోకినా భగ్గుమండిపోతుంటాయవి. ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల రేట్లు కూడా మండే స్వభావాన్ని అందుకున్నాయి. హైలీ ఇన్ఫ్లేమబుల్గా తయారయ్యాయి. దేశ రాజధానిలో పెట్రోలు, డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెట్రోలు రేటు అందుబాటులోనే ఉన్నప్పటికీ.. డీజిల్ ధర మాత్రం అసాధారణం.. అనూహ్యం. డీజిల్ లీటర్ ఒక్కింటికి ఏకంగా 7 రూపాయల 10 పైసల మేర పెరిగింది ఢిల్లీలో.
మద్యం రేట్లను పెంచిన మరుసటి రోజే..
మద్యం విక్రయాలపై వసూలు చేసే అమ్మకపు పన్నును రాత్రికి రాత్రి 70 శాతం పెంచిన ఢిల్లీ ప్రభుత్వం. కరోనా ఫీజు పేరుతో మద్యం అమ్మకాలపై 70 శాతం భారాన్ని అదనంగా మోపుతూ కేజ్రీవాల్ సర్కార్ రాత్రికి రాత్రి ఓ సర్కులర్ను జారీచేయగా.. తెల్లారే సరికి చమురు సంస్థలు మరో కొత్త షాక్ ఇచ్చాయి. పెట్రో ఉత్పత్తుల రేట్లను సవరించాయి. భారీగా పెంచేశాయి. ఢిల్లీలోనే డీజిల్ రేటులో రూ.7.10 పైసల మేర పెరిగిందంటే.. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో దాని సెగ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోలుపై రూ.1.67 పైసలు, డీజిల్పై రూ.7.10 పైసలను పెంచాయి. ఫలితంగా న్యూఢిల్లీలో వాటి రేట్లు అనూహ్యంగా పెరిగాయి.
భారీగా తగ్గుతాయని ఆశించినా..
ఢిల్లీలో పెట్రోలు రేట్లు లీటర్ ఒక్కింటికి రూ.71.26 పైసలు ఉండగా.. డీజిల్ రేటు దానితో పోటీ పడుతోంది. డీజిల్ రూ.69.59 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోలు రేట్లలో రూ.3.26 పైసల పెరుగుదల చోటు చేసుకుంది. ఒకవంక అమలులో ఉన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు విక్రయాలు తగ్గిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ రేటు జీరో స్థాయి కంటే దిగజారింది. దీనివల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు నేలచూపులు చూడాల్సి వస్తుందని భావించారు. లాక్డౌన్ వల్ల పెట్రోలు, డీజిల్ అమ్మకాలు కూడా క్షీణించడం వల్ల వాటి రేట్లు ఇంకా తగ్గుతాయనే ఊహించారు.
కరోనా పరిస్థితులే కారణం..
ఈ పరిస్థితుల్లో చముు సంస్థలు పెట్రోలు, డీజిల్ రేట్లను సవరించడం, వాటిని భారీగా పెంచడం అనూహ్య పరిణామమే. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్ల ఆర్థిక రంగం కుదేలైంది. ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ పెను ప్రభావాన్ని చూపింది. ఇప్పట్లో కోలుకోలేని విధంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచడం వల్ల పన్నుల రూపంలో భారీగా నిధులు సమకూరే అవకాశం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తుల రేట్లను షాక్ కొట్టేలా పెంచినట్లు చెబుతున్నారు.