డాక్టర్ కఫీల్ ఖాన్ కు బెయిల్ - ఎన్ఎస్ఏ ఆరోపణలు కొట్టివేత - అలహాబాద్ హైకోర్టు తీర్పు
ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ ఆగ్రహానికి గురై, పలు తీవ్రమైన కేసుల్లో జైలు పాలైన ప్రముఖ డాక్టర్ కఫీల్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద జైలులో ఉన్న ఆయనకు ఎనిమిది నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మథుర జైలులో ఉన్న ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
మహిళ గొంతులో 4 అడుగుల పాము - నోరు తెరిచి నిద్రపోతే అంతే మరి - వైరల్ వీడియో
అంతేకాదు కఫీల్ ఖాన్ పై జాతీయ భద్రతా చట్టం కింద మోపిన కేసు అక్రమమంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఆరోపించినట్లుగా.. సీఏఏ వ్యతిరేక నిరసనలో డాక్టర్ చేసిన ప్రసంగాలు విద్వేషాలను రెచ్చగొట్టేలా లేవని, అందరూ ఐకమత్యంగా పోరాడాలని మాత్రమే ఆయన చెప్పారని కోర్టు స్పష్టం చేసింది. కఫీల్ పై ఎన్ఎస్ఏ కింద దాఖలైన ఆరోపణల్ని కొట్టేస్తున్నట్లు జడ్జిలు ప్రకటించారు.
2017లో గోరఖ్పూర్ లో ఆక్సిజన్ అందక వందలాది మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో డాక్టర్ కఫీల్ ఖాన్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. చిన్నారులు చనిపోయిన బీఆర్డీ మెడికల్ కాలేజీలోనే పని చేసిన కఫీల్.. యోగి సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చిన్న పిల్లల మరణాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచి జైలుకు వస్తూ పోతోన్న ఆయనపై ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది.
సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు రావడంతో డాక్టర్ కఫీల్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. 2020, ఫిబ్రవరి 13న అలీగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కఫీల్ ను జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అరెస్టు చేశారు. అయితే, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఎన్ఎస్ఏ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఎనిమిది నెలల తర్వాత కఫీల్ జైలు నుంచి విడుదల కానున్నారు.