జోష్లో ఉన్న బీజేపీ: ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మూడినట్లేనా..?
గురువారం వెలువడిన సార్వత్రిక ఫలితాలతో మోడీ విక్టరీ వన్ సైడ్ అయిపోయింది. ఇక బీజేపీ ఘన విజయం సాధించడంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు హిందీ రాష్ట్రాలపై కమలం పార్టీ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి అమిత్ షా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది..? ఈ రెండు రాష్ట్రాల్లోనే దృష్టిసారిస్తారా లేక వెంటిలేటర్పై ఉన్న కర్నాటకను కూడా కదిలిస్తారా..?
మూడు రాష్ట్రాలపై కన్నేసిన కమలం
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరూ ఊహించని బంపర్ మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో పాగా వేసిన కమలం పార్టీ..గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్రాలపై కన్నేసినట్లు సమాచారం. ఎలాగైనా సరే మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.
మధ్యప్రదేశ్లో మారనున్న రాజకీయ సమీకరణాలు..?
మధ్యప్రదేశ్లో ఒక్కసారి పొలిటికల్ ఈక్వేషన్స్ గమనిస్తే అక్కడ మొత్తం అసెంబ్లీ సీట్లు 230. ఇందులో కాంగ్రెస్కు 114 సీట్లు గెలుచుకోగా బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది. ఇక బీఎస్పీ 2 సీట్లు, ఎస్పీ 1 సీటు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు. దీంతో బీఎస్పీ ఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొద్దిరోజుల క్రితం కమలనాథ్ ప్రభుత్వం మైనార్టీలో ఉందనే వార్తలు కూడా షికారు చేశాయి. అయితే ఇప్పుడు ఇవే వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆసమయంలో బీజేపీ రాష్ట్ర గవర్నర్ను కూడా కలిసి కమలనాథ్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కమలనాథ్ పలు ఆరోపణలు కూడా చేశారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనాలని చూస్తోందన్నారు. ఇదిలా ఉంటే మోడీ-షా ద్వయం మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఒక డెసిషన్కు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకోగలిగితే ఇక అక్కడ వారికి తిరుగుండదనే ప్రచారం జరుగుతోంది.
కర్నాటకలో అమిత్ షా పాచిక పారుతుందా..?
ఇక కర్నాటకలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. కర్నాటకలో ఇప్పటికే కుమారస్వామి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంతో మళ్లీ అక్కడి పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమిత్ షా కర్నాటకను చాలా సీరియస్గా తీసుకున్నారనే వార్త బీజేపీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాబోయే రెండు మూడు నెలల్లో కర్నాటకలో ఏమైనా జరగొచ్చనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ బద్దలు కొడుతుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
రాజస్థాన్ను కమలం కమాండ్ చేస్తుందా..?
రాజస్థాన్లో 200 అసెంబ్లీ సీట్లుండగా అక్కడ కాంగ్రెస్ 112 సీట్లు గెలువగా, బీఎస్పీ 6 స్థానాలు,ఆర్ఎల్డీ ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఇక ఇక్కడ 15నుంచి 20మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి తప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ నుంచి ఎవరు ఫిరాయించినా, 13 మంది స్వతంత్రులను, బీఎస్పీలాంటి పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకొనే అధికారం చేపట్టగలదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లు రెండింటా బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు సాధించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగే నైతిక అర్హతను కోల్పోయాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి..
మొత్తానికి లోక్సభ ఎన్నికల ఫలితాలతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెలువడిన ఫలితాలతో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు సమీక్షలు చేశారని తెలుస్తోంది. అయితే అమిత్ షా ఎంతవరకు తన పాచికను పారిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.