తీహార్..నేరగాళ్లకు హడల్: ఆ కరడుగట్టిన ఉగ్రవాదిదే చివరి ఉరి: మళ్లీ ఈ రేపిస్టులు..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తీహార్ కేంద్ర కారాగారం అంటే నేరస్తులకు హడల్. తీవ్రమైన నేరానికి పాల్పడిన నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన జైలు అది. దోషులను ఉరి తీసిన సంఘటనలు తీహార్ జైలులో ఎక్కువగా నమోదయ్యాయి. ఆరు సంవత్సరాల తరువాత మరోసారి ఈ తీహార్ జైలులో ఉరిశిక్షను అమలు చేయబోతన్నారు అధికారులు. నిర్భయపై అత్యాచారం చేసిన కేసులో నలుగురు దోషులు ముఖేష్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ ఉరికంబాన్ని ఎక్కనున్నారు.
అఫ్జల్ గురు తరువాత..
చివరిసారిగా కరడుగట్టిన ఉగ్రవాది అఫ్జల్ గురును ఇదే తీహార్ జైలును ఉరి తీశారు. పార్లమెంట్ భవనంపై భయానక దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురు ప్రధాన నిందితుడు. ఈ కేసులో అతనికి 2013 ఫిబ్రవరి 13వ తేదీన ఉరి తీశారు. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు సంయుక్తంగా పార్లమెంట్ భవనంపై దాడి చేసిన ఘటనలో తొమ్మిదిమంది మరణించారు. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ భవనంపై ఉగ్రవాద దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్ గురు ప్రధాన నిందితుడు. అతణ్ని తీహార్ జైలులోనే ఉరితీశారు. సుమారు ఆరేళ్ల తరువాత మళ్లీ నిర్భయ రేపిస్టులకు ఉరి పడబోతోంది. ముంబైపై దాడి చేసిన కేసులో కసబ్ను పుణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు.
మూడుసార్లు తప్పించుకున్నా..
తాజాగా- పారామెడికల్ విద్యార్థినిపై దేశ రాజధానిలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కనున్నారు. మరి కాస్సేపట్లో వారికి విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేష్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్.. ఉరికంబాన్ని ఎక్కనున్నారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి వాళ్లు ఇన్నాళ్లు చట్టాన్ని అడ్డుగా పెట్టుకున్నారు. మూడుసార్లు ఉరి నుంచి తప్పించుకోగలిగారు.
Recommended Video
ఉరి కంబాన్ని ప్రత్యక్షంగా తిలకించేది ఎవరంటే..
నిర్భయ దోషులకు తీహార్ కేంద్ర కారాగారం కాంప్లెక్స్లోని మూడో నంబర్ జైలులో ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్, జైలు ఉన్నతాధికారులు, కొద్దిమంది సిబ్బంది మాత్రమే అక్కడ ఉంటారు. నలుగురినీ ఒకేసారి.. ఉరి తీయబోతున్నారు. దీనికోసం వేర్వేరుగా ఉరికొయ్యలను సిద్ధం చేశారు. ఇప్పటికే డమ్మీ ఉరిశిక్షను కూడా అమలు చేశారు. దోషుల వ్యక్తిగత బరువుకు సరితూగే ఇసుక మూటలతో డమ్మీ ఉరితీతను నిర్వహించారు.