ఇవి రాజకీయదాడులేనా : నిన్న అఖిలేష్ పై సీబీఐ... నేడు మాయావతిపై ఈడీ దాడులు
ఎన్నికల వేళ కేంద్ర సంస్థల దాడులు రాజకీయనాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశ ప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో నేతలను దాడులు కలవరపెడుతున్నాయి. మొన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై శాండ్ మైనింగ్ కేసులో సీబీఐ దాడులు జరిగిన ఘటన మరువకముందే ఈసారి టార్గెట్ బహుజన్ సమాజ్వాదీ అధినేత్రి మాయావతి అయ్యారు. ఇంతకీ ఈ దాడులు ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు చేయిస్తున్నారు.. ?
మాయావతి హయాంలో రూ.1400 కోట్ల భారీ స్కామ్
ఉత్తర్ ప్రదేశ్.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రాష్ట్రం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే రాష్ట్రం. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎస్పీ బీఎస్పీలు ఒక్కటవడంతో కేంద్రం కూడా అక్కడి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇక ఈ విషయం పక్కనబెడితే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విగ్రహాల ఏర్పాటులో రూ.1400 కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించే ఈడీ మాయావతి హయాం నాటి కేసును తిరగదోడుతోంది.
గతవారం అఖిలేష్ యాదవ్ క్యాబినెట్ మంత్రులపై సీబీఐ దాడులు
అంతకుముందు అంటే గతవారం 2012-16ల మధ్య అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన శాండ్ మైనింగ్కు సంబంధించి అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ 14 చోట్ల దాడులు నిర్వహించింది. అధికార పక్షం ఎన్నికలకు ముందు విపక్షపార్టీలను టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు అఖిలేష్ యాదవ్. అఖిలేష్కు ఆ సమయంలో మాయావతి మద్దతుగా నిలిచారు.
మాజీ మంత్రి నసీముద్దీన్ సిద్ధిఖీతో పాటు 197 మంది కేసు నమోదు
మాజీ మంత్రులైన నసీముద్దీన్ సిద్ధిఖీ, బాబు సింగ్ కుష్వాహాలతో పాటు మరో 197 మందిపై యూపీ లోకాయుక్త కేసులు నమోదు చేసింది. లక్నో నోయిడాలో దళిత నేతల విగ్రహాల ఏర్పాటులో ఇసుకరాయి కొనుగోలులో అవినీతి జరిగిందన్న అభియోగాలు వీరిపై మోపింది లోకాయుక్త. అప్పుడు మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు విగ్రహాల స్కామ్కు సంబంధించి లోకాయుక్త ఎన్కే మెహ్రోత్రా 88 పేజీలతో కూడిన నివేదికను నాటి సీఎం అఖిలేష్ యాదవ్కు అందజేశారు. అయితే మాయావతి అవినీతి చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎఫ్ఐఆర్లో ఆమె పేరును నమోదు చేయలేదు. ఇదిలా ఉంటే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి మంత్రి నసీముద్దిన్ సిద్ధిఖీ బీఎస్పీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇక బాబు సింగ్ కుష్వాహా జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో అవినీతి చేశారని ఆరోపణలు రావడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.
35 శాతం డబ్బులు నేతలు అధికారుల జేబుల్లోకి వెళ్లాయి
ఇక విగ్రహాల స్కాంలో నసీముద్దీన్, బాబుసింగ్ కుష్వాహాలతో పాటు చాలా మంది ఇంజనీర్లు, అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చింది లోకాయుక్త. ఇక కేసులో విచారణ చేయగా విగ్రహాల కోసం రూ.4,188 కోట్లు ఖర్చుచేసినట్లు చూపారని ఇందులో 35 శాతం డబ్బులు బ్యూరోక్రాట్లు, రాజకీయనాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు జేబుల్లోకి వెళ్లిందని లోకాయుక్త తన రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు కేసులో లోతైన దర్యాప్తు అవసరమని సూచించిన లోకాయుక్త....199 మంది కమిషన్ తీసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది.