మొన్న అమిత్ షా... నేడు రాహుల్ గాంధీ: మమతా స్కెచ్ ఏంటి..?
బెంగాల్ గడ్డపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ల హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి నిరాకరించిన మమతా బెనర్జీ సర్కార్.... తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించనున్న చాపర్ ల్యాండ్ అయ్యేందుకు కూడా అనుమతి నిరాకరించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ నెల 14న సిలిగురికి రానున్నారు. అయితే తన చాపర్ ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. బెంగాల్లో రాహుల్ గాంధీ ఎంట్రీని మమతా ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.
కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ మమతా బెనర్జీల మధ్య ఓ చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ పోరాటం బీజేపీ పైన కాదన్న మమతా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 10న రాయ్గంజ్ లోక్సభ నియోజకవర్గంలో మాట్లాడిన రాహుల్ గాంధీ... మమతను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నించలేదని అదే మమతా బెనర్జీ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించారనే ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ ఇద్దరూ ఒక్కటే అన్న వ్యాఖ్యలపై కూడా మమతా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గతంలో కమ్యూనిస్టులు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని పాలించారో అదే పద్దతులను మమతా బెనర్జీ కూడా అవలంబిస్తున్నారని రాహుల్ గాంధీ ఓ ర్యాలీలో చెప్పారు. అంతేకాదు మమతా బెనర్జీ బెంగాల్లో నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు.ఆమె ఎవరినీ సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటుందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోయేది తామే అని చెప్పిన రాహుల్ గాంధీ... ఆ తర్వాత బెంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తామో చూస్తారని రాహుల్ అన్నారు.