యజమానులను కాపాడేందుకు.. నాగుపాముతో భీకరంగా పోరాడిన శునకం
తన యజమానులను రక్షించేందుకు నాగుపాముతో తలపడటమే కాక, దాంతో వీరోచితంగా పోరాడి పామును చంపి, తనూ ప్రాణాలు వదిలింది ఓ శునకం.
ఎర్నాకుళం : విశ్వాసం, విధేయతకు మారుపేరైన ఓ జాగిలం ఓ నాగుపాముతో పోరాడిన వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ నాగుపాము బారినుంచి తన యజమానులను రక్షించేందుకు వీరోచితంగా పోరాడి ఆపైన పాము కాటుకు గురై ప్రాణాలు వదిలింది.
కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎర్నాకుళంలోని పెరంబవూరులో నివసించే ప్రభుత్వ మాజీ అధికారి గంగాధరన్ దంపతులు నెలరోజుల వయసున్న ఓ కుక్కపిల్లను తమ ఇంటికి తీసుకొచ్చుకుని, దానికి మౌళి అని పేరు పెట్టి పెంచుకోసాగారు.
ఇటీవల ఓ రోజు వారు ఇంట్లో ఉండగా ఐదు అడుగుల పొడవున్న పెద్ద నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన మూడేళ్ల వయసున్న వారి పెంపుడు కుక్క మౌళి ధైర్యంగా ఆ నాగుపామును నిలువరించింది.
దాని అరుపులకు నిద్రలేచిన గంగాధరన్ దంపతులు బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా మౌళి వారిని అడ్డుకుంది. పరుగుపరుగున పోయి ఆ నాగుపాముతో తలపడింది. దాదాపు అరగంట సేపు పామును నిలువరించిన మౌళి చివరికి దాంతో పోరాటానికి దిగింది.
మూడు నిమిషాలపాటు జరిగిన పోరాటంలో చివరికి అది నాగుపామును చంపేసింది. కానీ ఆ పోరాటంలో పాము కాటుకు గురై అది కూడా ప్రాణం వదిలింది. ముచ్చట పడి తన యజమానులు తనను పెంచుకున్నందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టి తన విశ్వాసాన్ని నిరూపించుకుంది మౌళి. ఈ ఘటన అంతర్జాలంలో వైరల్ గా మారింది.