వైఎస్ జగన్ బాటలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్: పీపీఏలను రద్దు: నోరెత్తని కేంద్రం
లక్నో/అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల వ్యవహారంలో ఓ సరికొత్త కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. పీపీఏలను పున:సమీక్షించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఒకవంక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలోన్న బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో.. మరోవంక అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇదివరకు ప్రైవేటు విద్యుత్ ఉత్పాదక సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసి పడేసింది. ఈ పీపీఏల విలువు 650 మెగావాట్లు. దీనికి సంబంధించిన కిందటి వారమే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి కూడా.
రేటు అధికంగా ఉండటమే..
సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సౌర విద్యుత్ సరఫరా కోసం యూనిట్ ఒక్కింటికి రూ.3.46 పైసల చొప్పున ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 2017లో ప్రైవేటు సంస్థలతో పీపీఏలను కుదుర్చుకుంది. మిత్రా ఎనర్జీ, సెంబ్ కార్ప్, ఐనాక్స్ విండ్ సంస్థలతో అప్పట్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. తాజాగా- నాటి ధరల కంటే తక్కువకే తాము విద్యుత్ ను సరఫరా చేస్తామంటూ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తాజాగా బిడ్ ను దాఖలు చేసింది. యూనిట్ ఒక్కింటికి రూ.3.02 పైసలకే విద్యుత్ ను విక్రయించడానికి ముందుకొచ్చింది.
ఏడు శాతం తక్కువకే..
దీనిపై ప్రభుత్వం కమిటీని వేసింది. సమీక్షను నిర్వహించింది. 2017 నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పోల్చుకుంటే ఏడుశాతం తక్కువ ధరకే తాజాగా బిడ్లు దాఖలైనట్లు కమిటీ నిర్దారించింది. రెండేళ్ల కిందట దాఖలైన బిడ్స్ తో పాటు తాజాగా వచ్చిన టెండర్లపై ఉన్నతాధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఏడు శాతం తక్కువకే అంటే సుమారు యూనిట్ ఒక్కింటికి రూ.3.02 పైసలకే సంప్రదాయేతర విద్యుత్ సరఫరా అవుతుందని ధృవీకరించింది. దీనితో నాటి పీపీఏలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గత వారమే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
కేంద్రానికి సమాచారం ఇవ్వకుండానే..
పీపీఏలను రద్దు చేస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంలో ఉన్న ఓ ట్విస్ట్ ఏమిటంటే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి ముందస్తు ప్రకటన చేయలేదు. చెప్పా పెట్టకుండా, చడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రి పీపీఏలను రద్దు చేశారు. కేంద్రానికి కనీస సమాచారం ఇవ్వలేదు. దీనిపై ప్రైవేటు విద్యుత్ ఉత్పాదక సంస్థలు న్యాయపోరాటానికి కూడా దిగకపోవడం ఈ ఉదంతంలో ఉన్న ఇంకో ట్విస్ట్. ఈ వ్యవహారం కాస్తా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖను ఇరకాటంలో పడేసినట్టయింది. గత వారమే యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎక్కడా బహిరంగంగా స్పందించిన దాఖలాలు లేవు.
వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టి..
పీపీఏలను సమీక్షిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనలు, తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రతి సారీ తప్పు పడుతూ వచ్చారు. అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని హెచ్చరిస్తూ వచ్చారు. దీనితో పీపీఏల సమీక్షలపై వైఎస్ జగన్ ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఈ విషయంలో ముందడుగు వేయాలనుకున్న ప్రతీసారి కేంద్రం మోకాలడ్డుతూ వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఇప్పటిదాకా నోరు మెదపలేదు. దీన్ని అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పీపీఏల సమీక్షపై తన నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.