జగన్ బాటలోనే యడియూరప్ప: ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లపై కసరత్తు
Recommended Video
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో వైయస్ జగన్ తన కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టగా యడియూరప్ప తన కేబినెట్లో ముగ్గురికి ఉపముఖ్యమంత్రి హోదాను కల్పించారు. ఇక తాజాగా యడియూరప్ప మరో నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఏపీ సీఎం అవలంబిస్తున్న ఫార్ములానే కావడం విశేషం.
కర్నాటకలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు
2019 ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ ఉద్యోగాల విషయమై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలు లేక నిస్తేజంలో ఉన్న రాష్ట్ర యువతలో భరోసా నింపేందుకు తాము అధికారంలోకి వస్తే స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఇది ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా తమ రాష్ట్రంలో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ మేరకు బిల్లును తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించింది.
స్థానికుల ప్రయోజనాల దృష్ట్యా..
ఇది ఎవరిపై వివక్ష చూపేందుకు కాదని కేవలం స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకొస్తున్న బిల్లు అని కార్మిక శాఖ మంత్రి సురేష్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కర్నాటకలో ఉన్న పరిశ్రమల్లో లేదా సంస్థల్లో ఎక్కువగా ఉన్నారని ఇక్కడ కన్నడిగులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తుండటంతో పలువురి నిపుణులతో మాట్లాడి బిల్లుపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ చెప్పారు. ఇప్పటికే కన్నడిగులు అంటే ఎవరు ఎలాంటి అర్హతలు ఉంటే వారిని కన్నడిగులుగా పరిగణిస్తామనేదానిపై ఒక ముసాయిదా కూడా తయారు చేయడం జరిగిందని మంత్రి సురేష్ వెల్లడించారు.
కన్నడిగులుగా గుర్తింపు పొందాలంటే అర్హతలు
గత 15 ఏళ్లుగా కర్నాటకలో ఉంటూ కన్నడ భాష మాట్లాడటం తెలిసి ఉండటంతో పాటుగా కన్నడ భాషను చదివి రాయగలిగి ఉన్నవారిని కన్నడిగులుగా గుర్తిస్తామని మంత్రి చెప్పారు. కర్నాటకలో నివసిస్తూ కన్నడ రాయడం చదవడం తెలిసి ఉండాలనే నిబంధన చాలా న్యాయమైనదని మంత్రి చెప్పారు. అయితే ఈ బిల్లును రానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతారా లేక ఇంకాస్త సమయం తీసుకుంటారా అనేదానిపై మంత్రి క్లారిటీ ఇవ్వలేదు.
పలువురితో చర్చలు ప్రారంభం
ఇంకా బిల్లుకు తుది రూపం ఇవ్వలేదని ఆ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే కొందరు ఈ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉందని అయినప్పటికీ వారిని కన్విన్స్ చేయగలమనే నమ్మకం ఉందన్నారు మంత్రి సురేష్ కుమార్. ఇప్పటికే పలు స్టేట్హోల్డర్స్, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని వారందరితో చర్చించాక ఒక ఏకాభిప్రాయం కుదిరితే బిల్లును ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు.