మమతకు భారీ షాక్: త్రిపురపై బీజేపీ గురి, గంపగుత్తగా తృణమూల్ నేతలు జంప్!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ కన్ను ఇప్పుడు త్రిపుర రాష్ట్రంపై పడింది. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ బలోపేతానికి కసరత్తులు.
న్యూఢిల్లీ: ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ కన్ను ఇప్పుడు త్రిపుర రాష్ట్రంపై పడింది. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ బలోపేతానికి కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అధికార సీపీఎంను గాక రాష్ట్రంలోని ఇతర పార్టీలను బలహీనపరచాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నేతలను బీజేపీ ఆకర్షిస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన 400మంది నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఇందులో వివిధ కమిటీలు, స్థానిక సంఘాల నేతలు సహా త్రిపుర తృణమూల్ చీఫ్ రతన్ చక్రవర్తి కూడా ఉండటం గమనార్హం. పార్టీ చీఫ్ తో సహా ఇంత భారీ స్థాయిలో నేతలు ఒకేసారి పార్టీని వీడటం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇదొక భారీ షాక్ అని చెప్పాలి.
కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రాజెన్ గోహెయిన్, త్రిపుర బీజేపీ అధ్యక్షుడు బిప్ లాబ్ దేవ్ తృణమూల్ నేతలను బీజేపీలోకి స్వాగతించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీయేనని అందుకే ఆ పార్టీలో చేరామని తృణమూల్ నేతలు చెప్పడం గమనార్హం. ఈశాన్య భారత్ లో అసాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండటంతో.. ఇప్పుడు ఆ పార్టీ చూపు త్రిపురపై పడింది.
కాగా, ప్రస్తుతం త్రిపుర సీఎంగా మాణిక్ సర్కార్ కొనసాగుతున్నారు. గత 19ఏళ్లుగా త్రిపురలో ఆయనే సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికీ అక్కడి ప్రజల్లో మాణిక్ సర్కార్ పట్ల విశ్వసనీయత సడలలేదు. అందువల్లే అధికార పార్టీని టార్గెట్ చేయడం కన్నా, మిగతా పార్టీలను టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో కనీసం కింగ్ మేకర్ కావాలన్న యోచనలో బీజేపీ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్ ను బీజేపీ దెబ్బకొట్టింది.