అయ్యోధ్య అయ్యింది..ఇక శబరిమల మిగిలింది..ఈ వారంలోనే తీర్పు
Recommended Video
తిరువనంతపురం: అయోధ్య వివాదంకు దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని చెబుతూ అదే సమయంలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల భూమి కేటాయించాలంటూ చారిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా ఇలాంటి సున్నితమైన కేసులు అతి ప్రాముఖ్యత కలిగి ఉన్న మరో నాలుగు కేసులపై తీర్పును ఇవ్వనున్నారు. అందులో ప్రథమంగా శబరిమల రివ్యూ పిటిషన్ కేసు ఉంది.
మహిళలు ప్రవేశంకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సు మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించగా కొందరు అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతేకాదు శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
శబరిమల కాంట్రవర్శీ ఏమిటి..?
శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి శివుడు మరియు మోహినిలకు జన్మించాడు. అయితే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయినందున 10 ఏళ్ల బాలిక నుంచి 50 ఏళ్ల మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదనేది ఒక విశ్వాసంగా వస్తోంది. దీన్నే భక్తులు బలంగా నమ్ముతారు కూడా. ఈ నమ్మకం, విశ్వాసంలకు మద్దతుగా 1991లో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు ఆలయం ప్రవేశం చేయరాదని తన తీర్పులో పేర్కొంది.
హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరిగింది..?
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్కు చెందిన ఆరుమంది మహిళలు సుప్రీంకోర్టులో 2006లో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఉందంటూ తమ పిటిషన్లో దాఖలు చేశారు. దీంతో 2018లో సుప్రీంకోర్టు 1991 నాటి తీర్పును తప్పుబడుతూ మహిళలందరికీ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు చాలామందిలో అసంతృప్తిని కలిగించింది. ఇక సుప్రీం తీర్పు చెప్పడంతో చాలామంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఇద్దరు మహిళలు మాత్రం ఆలయంలోకి ఈఏడాది జనవరిలో ప్రవేశించగలిగారు.
2018లో సుప్రీంకోర్టు తీర్పు ఏమని చెప్పింది..?
సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ముఖ్యంగా శబరిమల దగ్గర భక్తులు మహిళలను అడ్డుకున్నారు. అంతేకాదు మహిళలకు రుతుక్రమం ఉన్న సమయంలో వారిని మైలగా చూస్తారనే నమ్మకం అక్కడి భక్తుల్లో ఉంది. అలాంటి మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే శాపం వస్తుందని విశ్వసిస్తారు. ఎప్పుడో పురాతణ నమ్మకాలను తీసుకొచ్చి నేడు మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా అంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదని చాలామంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే స్వామివారికి ఆగ్రహం వస్తుందనే భావనలో ఉన్నారు. 2018 సుప్రీంకోర్టు తీర్పు 4-1మెజార్టీతో వచ్చింది. నలుగురు జడ్జీలు మహిళల ప్రవేశంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులోని మహిళా జడ్జి ఇందూ మల్హోత్ర మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉండకూదని తీర్పు రాసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 65 రివ్యూ పిటిషన్లు ధాఖలయ్యాయి.